Andhra Pradesh News | ప్రకృతి రమణీయతతో అలరించే కోనసీమ సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతోంది.. ఈసారి అయితే సంబరాలతోపాటు ఔత్సాహికులకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు పోటీలు పెట్టి గెలుపొందిన వారికి ట్రోఫీలు, బహుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇందులో భాగంగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల‌ లాకుల వద్ద పడవ పోటీలు, వివిధ విభాగాల్లో మరిన్ని పోటీలు నిర్వహించి సంక్రాంతి పండుగలను సంబరంలా నిర్వహించేందుకు సన్నధ్ధమవుతోంది...

పోటీలు ప్రోమోను విడుదల చేసిన కలెక్టర్‌..

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లల్ల లాకుల వద్ద ప్రధాన పంటకాలువలో కొత్తసంవత్సరంలో సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ పేరుతో జనవరి 11 నుంచి 13 వతేదీ వరకు జరగనున్న వివిధ పోటీలకు సంబందించి ప్రోమో బ్రోచర్లను కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు సంయుక్తంగా విడుదల చేశారు. అంతేకాకుండా పడవ పోటీలకు సంబందించి విజేతలకు అందించే ట్రోఫీలను కాలువలో పడవలపై ప్రయాణిస్తూ ఆవిష్కరించారు. ఉత్సవాలు ముగింపు రోజు అయిన 13న పడవ పోటీలు జరుగుతాయని కలెక్టర్‌ తెలిపారు.

కోనసీమను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు..

ప్రకృతి అందాలతో కేరళను తలపించే కోనసీమ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఈ తరహా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ మహేష్‌కుమార్‌, ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు వెల్లడిరచారు. కేరళ తరహాలో కోనసీమలో ఏకో టూరిజం, టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. 

యానాంలో వుమెన్‌ బీచ్‌ వాలీబాల్‌ పోటీలు...

అమలాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పలగుప్తం మండలం సూర్సానయానాం తీరప్రాంతంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో జాతీయ స్థాయి మహిళా బీచ్‌ వాలీబాల్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. 

Also Read: Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి