Konaseema Crime News:అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ వ్యక్తి మృతి కలకలం రేపింది. ఇంటి ముందు ఉండే గుడిసెలో నిద్రపోతున్న ఆ వ్యక్తి రాత్రికి రాత్రే శవమై కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సడన్‌గా చనిపోవడంతో అనుమానం వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి దొంగను పట్టుకున్నారు. అంతే అంతా షాక్ అయ్యారు. 


మండపేట మేదరిపేటకు చెందిన రాంబాబు సడెన్‌గా చనిపోయారు. పడుకున్నచోటే ప్రాణాలు వదిలేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. కుమార్తె ఆయన ప్రాణాలు తీసిందని తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తండ్రి ప్రాణాలను ప్రియుడితో తీయించిందని తేల్చారు. 


రాంబాబును చంపిన వెంకట దుర్గ విషయంలో చాలా కాలంగా వివాదాలు నడుస్తున్నాయి. భర్త, ముగ్గురు పిల్లల్ని వదిలేసి కన్నవారింటికి వచ్చేసిందామె. ఈ క్రమంలోనే రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ముమ్మిడివరపు సురేష్‌తో పరిచయం ఏర్పడింది. మేకల కబేలా పని నిమిత్తం మండపేట వచ్చేవాడు. ఈ పరిచయం కాస్త వివాహేతస సంబంధానికి దారి తీసింది. ఈ విషయంలో భర్త కూడా ఆమెతో గొడవ పడ్డాడు. అయినా దుర్గ వైఖరిలో మార్పురాలేదు. 


కుమార్తె దుర్గ జీవితం నాశనమైపోతుందని భయపడి తండ్రి కూడా కలుగుజేసుకున్నాడు. చాలా సార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా కుమార్తె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఓ సారి చేయి చేసుకున్నాడు. దీంతో దుర్గ ఎదురు తిరిగింది. మిగతా కుటుంబ సభ్యులు తిట్టిపోశారు. తండ్రికే సపోర్ట్ చేశారు. 


అంతే కాకుండా దుర్గను తండ్రి కట్టడం చేయడం మొదలు పెట్టారు. బయటకు రానివ్వకుండా చేశారు. అంతా తనకు వ్యతిరేకంగా మారుతున్నారని దుర్గ భావించింది. తనకు తన ఆనందానికి అడ్డుగా వస్తున్నారని రగిలిపోయింది. దీనంతటికి తండ్రే కారణమని ఆయన అడ్డుతొలగించుకోవాలని స్కెచ్ వేసింది. ఈ విషయంపై ప్రియుడితో చర్చించింది. సురేష్ కూడా అందుకు ఓకే చెపప్పాడు. 


ఒంట‌రిగా ప‌డుకునేలా ప‌థ‌క ర‌చ‌న చేసి మ‌రీ.. 
భ‌ర్త‌తో విడిపోయిన నాటి నుంచి త‌ల్లితండ్ర‌లుతో క‌లిసే ఉంటున్న దుర్గ రోజూ పిల్లలతో కలిసి డాబా ఇంటిలో నిద్రిస్తుంది. తల్లిదండ్రులు మాత్రం సమీపంలోనే వున్న మరో గుడిసెలో నిద్రపోయేవారు. తండ్రిని చంపేయాలని ప్లాన్ చేసిన దుర్గ ఈనెల 16న తల్లిని తనతో పడుకోవాలని చెప్పింది. పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి తల్లిని డైవర్ట్ చేసింది. డాబాలో పిల్లలతోపాటు పడుకునేలా చేసింది. 


అంతా నిద్రపోయిన తర్వాత కొత్తూరులో ఉన్న ప్రియుడికి సమాచారం చేరవేసింది. తండ్రి ఒక్కడే పడుకున్నట్టు చెప్పింది. లేపేయాలని సూచించింది. అర్థరాత్రి ప్రియుడు సురేష్ తన స్నేహితుడు నాగార్జున కలిసి వచ్చి దుర్గ తండ్రిని చంపేశారు. కాళ్ళు ఒకరు పట్టుకోగా ఛాతీపై మరొకరు కూర్చుని పీక నులిమి చంపేశారు. 


ఆరోగ్యంగా ఉన్న రాంబాబు తెల్లారేసరికి మరణించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనిపై కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు కుమారుడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత‌దేహానికి పోస్ట్‌మార్టం నిర్వ‌హించారు. 


పోస్టుమార్టం నివేదిక‌లు అస‌లు నిజం..
మృతుడు రాంబాబు మృతిపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసుల‌కు పోస్టుమార్టం రిపోర్టులో అది హత్యగా తేలింది. పీక  నులిమి చంపేసినట్టు ప‌క్క‌టెముక‌ల వ‌ద్ద‌ బలంగా తన్ని గాయమైనట్టు తేలింది. దీంతో సీఐ సురేష్ దర్యాప్తు వేగవంతం చేశారు. తమదైన శైలిలో విచారణ మొదలు పెట్టారు. దీంతో అసలు నేరస్థులు బయటపడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారమే తండ్రిని చంపినట్లు కూతురు దుర్గా గీకరించింది. ఈ మేరకు నిందితులు ముగ్గురిని పోలీస్ లు అరెస్ట్ చేసి రామచంద్రపురం కోర్టుకు తరలించారు.