జగనన్న గోరుముద్దలో చేరిన మరో పోషకాహారాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేర్చింది. మధ్యాహ్న భోజన పథకంలో మార్చి 2 నుంచి రాగిజావ అందించాలని సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.
పిల్లలలకు పోషకాహారం కోసం...
పిల్లలకు ఐరన్, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి రాగి జావ అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జగనన్న గోరుముద్ద మెనూలో రాగిజావ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్న శ్రీ సత్యసాయి ఛారిటబుల్‌ ట్రస్టుతో సర్కార్ ఓప్పందాలు చేసుకుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌ సమక్షంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు ప్రతినిధులు ఒప్పందాల పై సంతకాలు చేశారు.
జగనన్న గోరుముద్ద కార్యక్రమం...
జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమం. బడి పిల్లల్లో ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచడంతో పాటు వారిలో, డ్రాపౌట్స్‌ను తగ్గించే కార్యక్రమాల్లో భాగంగా వారికి స్కూళ్లోనే రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44,392 స్కూళ్లలో.. 37,63,698 విద్యార్ధులకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది.  ఈ పథకాన్ని 1 నుంచి 10 వ తరగతి వరకూ అమలు చేస్తోంది.


జనవరి 2020 న నిర్వహించిన సమీక్షలో పిల్లలకు మెరుగైన  పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా మిడ్‌ డే మీల్స్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమీక్షించి వారికి అందిస్తున్న మెనూలో పలు మార్పులు చేపట్టారు. అందులో భాగంగా రోజు వారీ అందిస్తున్న మెనూతో పాటు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారంలో 5 రోజులు గుడ్డు,  మూడు రోజులు బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వాలని నిర్దేశించారు.
బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వని రోజుల్లో పిల్లలకు తగినంత ఐరన్, కాల్షియం అందించేందుకు వీలుగా చిరుధాన్యాలను మధ్యాహ్న భోజన పథకంలో భాగం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే జగనన్న గోరుముద్దలో రాగిజావ అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మధ్యాహ్న భోజనంలో చిక్కీ ఇవ్వని రోజుల్లో అందుకు బదులుగా రాగిజావను మెనూలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వారానికి  మూడు రోజుల పాటు రాగిజావను మిడ్‌ డే మీల్స్‌లో భాగం చేశారు. ఈ కార్యక్రమం అమలు కోసం వివిధ స్వచ్ఛంద సంస్ధల బాగస్వామ్యం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మిడ్‌ డే మీల్స్‌లో పిల్లలకు రాగిజావ అందించే కార్యక్రమంలో భాగస్వామి అయింది. 
అద్భుతమైన కార్యక్రమమన్న సీఎం జగన్...
ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం అని సీఎం జగన్ తెలిపారు. అదే విధంగా స్వచ్చందంగా ముందుకు వచ్చిన శ్రీ సత్యసాయి ట్రస్ట్‌ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. గోరుముద్ద కార్యక్రమంలో రాగిజావను అదనంగా చేర్చడం ద్వారా మరింత పౌష్టిహాకారం పిల్లలకు అందుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. కేవలం గోరుముద్ద కార్యక్రమానికే రూ.1700 కోట్లు ఖర్చు పెడుతున్నామని, మూడున్నరేళ్ల కిందట గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. గతంలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే మధ్యాహ్న భోజన పథకానికి ఖర్చు పెడితే తామ ప్రభుత్వ హయాంలో ఆ ఖర్చు దాదాపు మూడు రెట్లు పెరిగిందని అన్నారు. అంతే కాదు విద్యారంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టామని, తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్నివ్వడానికి ఉద్దేశించిన అమ్మఒడి దగ్గర నుంచి మొదలుపెడితే.. నాడు – నేడు ద్వారా స్కూళ్ల వ్యవస్ధను మార్పు చేసే కార్యక్రమం చేస్తున్నామని జగన్ వివరించారు.


6వతరగతి ఆ పై తరగతుల్లో ప్రతి తరగతి గదిలో డిజిటిల్‌ స్క్రీన్‌ ఐఎఫ్‌పి ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.  30,230 తరగతి గదుల్లో ఈ ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పి)లను ఏర్పాటు చేస్తున్నాట్లు చెప్పారు. నాడు–నేడు తొలిదశ పూర్తి చేసుకున్న సుమారు 15వేల స్కూళ్లలో ఈ జూన్‌ నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నామని వెల్లడించారు. నాడు –నేడులో ఆఖరు కాంపొనెంట్‌ 6వతరగతి ఆ పై తరగతులను డిజిటలైజ్‌ చేసే కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు.