Radha Murder Case: జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు గ్రామ శివారులో 35 ఏళ్ల కోట రాధ అనే వివాహిత ఈ ఉదంతంలో ప్రాణాలు కోల్పోయారు. భర్తే ఆమెను కిరాతకంగా హతమార్చినట్లు సమాచారం. రాధ వద్ద అప్పు తీసుకున్న ఆమె చిన్ననాటి స్నేహితుడు కేతిరెడ్డి కాశిరెడ్డి డబ్బు ఇస్తాను రమ్మని నమ్మకంగా పిలిపించి కిరాతకంగా చంపి ఉంటాడనే అనుమానాలు వచ్చాయి. అయితే రాధ తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో అతని కోసం పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తరుణంలోనే కేసు అనూహ్యంగా మలుపు తిరిగింది. రాధ అంత్యక్రియలు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడలో శుక్రవారం సాయంత్రం ముగిశాయి. ఆ వెంటనే ఆమె భర్త, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కోట మోహన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రకాశం జిల్లాకు తరలించినట్లు సమాచారం. 


స్నేహితుడి పేరు మీద సిమ్ తీసుకొని ఛాటింగ్..!


రాధను ఆమె భర్త మోహన్ రెడ్డే మరి కొందరితో కలిసి దారుణంగా చంపేసినట్లు పోలీసులు ధ్రువీకరించినట్లు సమాచారం. ఉద్యోగం కోల్పోయి కష్టాల్లో ఉన్న స్నేహితుడికి చేయూత పేరిట రూ.80 లక్షల వరకు అప్పు ఇవ్వడం, ఆ మొత్తం తిరిగి రాకపోవడంతో దంపతుల మధ్య కొన్నాళ్లుగా తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే కాశిరెడ్డితో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందంటూ మోహన్ రెడ్డి అనుమానించాడు. కాశిరెడ్డి పేరిటి సిమ్ కార్డులు కొనుగోలు చేసి, అతని పేరుతోనే తన భార్యతో సెల్ ఫోన్ లో మోహన్ రెడ్డి ఛాటింగ్ చేసినట్లుగా గుర్తించారు. డబ్బులు ఇస్తామని అతని పేరుతోనే సందేశం పంపి ఈ నెల 19ల తేదీన ఆమెను స్వగ్రామం నుంచి కనిగిరి రప్పించాడు. అనంతరం రాధను కారులో తీసుకెళ్లి తీవ్రంగా హింసించి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


రాధ హత్య తర్వాత మోహన్ రెడ్డి ప్రవర్తనలో మార్పు..


అయితే రాధ మృతిపై అనేక అనుమానాలు ఉండగా.. భర్త ప్రవర్తనే అతడిని పట్టించింది. కనిగిరిలోని పామూరు బస్టాండు సెంటర్ లో వేచి ఉన్న రాధ వద్దకు వచ్చిన ఎరుపు రంగు కారు హైదరాబాద్ కు చెందిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. భార్య హతమైన తర్వాత మోహన్ రెడ్డి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈక్రమంలో అతని పాత్రపై అనుమానాలు రేకెత్తి మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. తన స్నేహితుడికి ఇచ్చిన అప్పు వసూలుకు వేధింపులు తాళ లేక తన తల్లిదండ్రులు, బంధువుల వద్ద నుంచి రూ.25 లక్షలు తీసుకెళ్లి భర్తకు ఇచ్చినట్లు తలిసింది. అదే సమయంలో రుణం తీసుకున్న కేతిరెడ్డి కాశిరెడ్డి అజ్ఞాతంలో ఉండడంతో తొలుత కేసు దర్యాప్తు.. అందరి దృష్టి అతని వైపే మళ్లింది. రాధ హత్యలో మోహన్ రెడ్డికి సహకరించిన వారు ఎవరనే కోణంలో పోలీసులు ప్రస్తుతం నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే మోహన్ రెడ్డికి భార్యపై ఎందుకు అంత కోపం, మరీ టార్చర్ చేసి చంపాల్సినంత వారిద్దరి మధ్య ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.