Andhra News : పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. గుంటూరులో పర్యటిస్తున్న ఆమె.. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.  కేంద్రం  1600 కోట్ల రూపాయలతో మంగళగిరి ప్రాంతంలో ఎయిడ్స్ హాస్పిటల్ నిర్మించారన్నారు.  పది రూపాయల ఫీజుతో  అత్యంత నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆస్పత్రికి కనీస సహకారం కూడా  అందించడం లేదన్నారు. 


ఆస్పత్రికి వెళ్లే దారిలో  అడ్డంగా ఉన్న విద్యుత్ తీగలు కూడా పక్కకు తొలగించలేదని.. కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేకపోయిందని మండిపడ్డారు.  పేదవాళ్లకు సేవ చేసే సంస్థకు, మౌలిక వసతులు కల్పించకపోవడం క్షమించరాని నేరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి రహిత, సమర్థవంత పాలన అందిస్తున్నారు.. బీజేపీ పాలనలో ఒక స్కాం కూడా లేదన్నారు పురంధేశ్వరి.. అణగారిన వర్గాల వారికి మేలు చేయాలన్న భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.. కరోనా లేక పోయిన పేదలకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమం అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. 


గ్రామ సచివాలయాలు ఏర్పాటు కూడా కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ పథకం కింద నిర్మించారు అనే విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలన్నారు. అమరావతి రాజధాని రైతులు ఇచ్చిన భూములకు కౌలు కూడా ఇవ్వడం లేదు.. అమరావతి వెళ్లిపోయింది అనే బాధతో ఆందోళన చేస్తున్న మహిళలను, పోలీసులు అడ్డుపెట్టుకొని ఈ ప్రభుత్వం వేధించిందన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందన్న ఆలోచనతో 20 వేల కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం- అమరావతి హైవే రోడ్డును 28 వేల కోట్ల రూపాయలతో కేంద్రం ఖరారు చేసింది.. చివరకు ఆ రోడ్లకు భూములు సేకరించే పని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరిగా చేయడం లేదన్నారు. విభజన సమయంలో ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ లాం లో ఏర్పాటు చేసేందుకు నిధులు ఇచ్చారు.. గత ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడం వల్ల 350 కోట్ల నిధులు వెనక్కి వెళ్లాయన్నారు.                                   


 ఏపీలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కేంద్రమే నిధులు ఇస్తోందని పురందేశ్వరి స్పష్టం చేశారు.  ఏపీ ప్రభుత్వానికి అప్పులు చేసే విషయంలో ఉన్న శ్రద్ధ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో లేదు అని విమర్శించారు  . ఒక పెద్ద పరిశ్రమ రాష్ట్రానికి రాలేదు.. మన పిల్లలకు ఉపాధి కల్పించే పరిస్థితి లేదు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.. గ్రామీణ అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చారు.. కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లించి జేబులు నింపుకోవడం తప్ప వైసీపీ నాయకులకు అభివృద్ధి మీద దృష్టి లేదని విమర్శలు గుప్పించారు.