Breaking News Telugu Live Updates: మునుగోడు ఎన్నికల్లో ఎవరినుంచి డబ్బులు తీసుకోలేదు: రేవంత్ రెడ్డి

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 22 Apr 2023 06:25 PM
మునుగోడు ఎన్నికల్లో ఎవరినుంచి డబ్బులు తీసుకోలేదు: రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా తడి బట్టలతో ప్రమాణం చేశారు. మునుగోడు ఎన్నికల్లో భాగంగా తాను ఎవరితోనూ డబ్బులు తీసుకోలేదన్నారు. డబ్బులు పంచం, చుక్క మందు కూడా పోయం అని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చెప్పారు. అదే విధంగా ఎన్నికల్లో పోరాడామన్నారు. కానీ బీజేపీ నేతలు ఈడీ, సీబీఐలు తమ వద్దే ఉన్నా, ఈటల రాజేందర్ ఇష్టరీతిన మునుగోడు ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి, పాల్వాయి స్రవంతికి బీఆర్ఎస్ నుంచి నగదు సహాయం లభించిందని ఈటల చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆధారాలు లేవు కనుక ఈటల అమ్మవారి ఆలయానికి రాలేదని, ప్రమాణం చేయలేదన్నారు.

తాను ఎవరినీ కించపరచలేదన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల

తాను ఎవరినీ కించపరచలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వ్యక్తిగతంగా ఎవర్నీ టార్గెట్ చేయలేదని, ఆత్మసాక్షిగానే ప్రమాణం చేశానన్నారు ఈటల. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా తడి బట్టలతో ప్రమాణం చేశారు. 

భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. మునుగోడు ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రూ.25 కోట్లు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల ఆరోపణలు చేశారు. తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని, భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా వచ్చి ప్రమాణం చేయాలని ఈటలకు సవాల్ విసిరారు రేవంత్. చెప్పినట్లుగానే రేవంత్ రెడ్డి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. కానీ ఈటల అమ్మవారి ఆలయానికి రాలేదు.

భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. చెప్పినట్లుగానే ఆలయానికి వచ్చిన రేవంత్ రెడ్డి తడి బట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నుంచి రూ.25 కోట్లు తీసుకోలేదని తాను ప్రమాణం చేసి, ఈటల ఆరోపణలపై మాట్లాడతానన్నారు. అయితే రేవంత్ విసిరిన సవాల్ కు ఈటల స్పందించలేదు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎమ్మెల్యే ఈటల రాలేదు. ప్రమాణాల సవాల్ నేపథ్యంలో చార్మినార్, భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భారీగా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రమాణానికి సై - భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరిన రేవంత్ రెడ్డి

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బయలుదేరారు. సీఎం కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి రూ.25 కోట్లు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదన్నారు రేవంత్ రెడ్డి. తాను భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి తడి బట్టలతో ప్రమాణం చేస్తానని, బీజేపీ ఎమ్మెల్యే ఈటల కూడా ప్రమాణం చేయడానికి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాను చేసిన సవాల్ లో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి రేవంత్ రెడ్డి బయలుదేరారు. మరికాసేపట్లో అక్కడికి చేరుకుని ప్రమాణం చేయనున్నారు రేవంత్ రెడ్డి. అయితే బీజేపీ నేత ఈటల ఎక్కడున్నారు, ఆయన కూడా ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

వరంగల్ సిపి రంగనాథ్ ను కలిసిన ప్రీతి కుటుంబ సభ్యులు

వరంగల్ సిపి రంగనాథ్ ను కలిసిన ప్రీతి కుటుంబ సభ్యులు


ప్రీతి తండ్రి నరేందర్ కామెంట్స్:


~ సిపి తో మాట్లాడి మా అ‌నుమానాలు నివృత్తి చేసుకున్నాం
~ ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం
~ సిరంజి దొరికిందని సిపి చెప్పారు.. ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు చెప్పారు
~ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో వచ్చిందని సిపి చెప్పారు. కానీ రిపోర్ట్ చూపించలేదు
~ పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందని నమ్ముతున్నాం
~ చార్జ్ షీట్ లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని చెప్పారు
~ కె ఎం సి ప్రిన్సిపాల్, హెచ్ ఓడి ల బాధ్యతారాహిత్యం ఉందనుకుంటు‌న్నాం

అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూలు

ఇదీ అమిత్ షా పర్యటన షెడ్యూలు. ఆర్ఆర్ఆర్ మూవీటీమ్ తో ముచ్చట... పార్టీ కార్యకర్తలతో విజయసంకల్ప సభ. #SwagathamAmitShahJi




 

PSLV-C55: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సి55 - కక్షలోకి సింగపూర్ శాటిలైట్స్

తిరుపతి జిల్లాలోని షార్‌ నుంచి పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (PSLV)-సి55 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రారంభమైంది. శనివారం మధ్యాహ్నం 2.20 గంటలకు పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలియోస్‌-2, 16 కిలోల లూమ్‌లైట్‌-4 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ55 కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. టెలియోస్‌-2 బరువు 741 కిలోలు. వీటి పనితీరు మొదలైతే అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ రాత్రింబవళ్లు కవరేజీ అందిస్తుంది. ఇ-నావిగేషన్‌ సముద్ర భద్రతను పెంచడం, ప్రపంచ షిప్పింగ్‌ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూరనుంది.



 

Background

రంజాన్‌ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనల్లో భారీ సంఖ్యలో ముస్లిం పాల్గొంటున్నారు. పండగ వేళలో ట్రాఫిక్ జామ్‌లు లేకుండా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. పాతబస్తీ, మిరాలం ఈద్గా, చార్మినార్‌, మాసబ్ ట్యాంక్‌, సింకిద్రాంబాద్‌, రాణిగంజ్‌ పరిసరప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. 


తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం శ్రీనివాసుడికి ప్రీతికరమైన రోజు కావడంతో సుప్రభాతం నువ్వుల గింజలతో ప్రసాదాన్ని నివేదించారు అర్చకులు. శుక్రవారం రోజున 57,354 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 24,398 మంది తలనీలాలు సమర్పించగా, 3.40 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.


సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 07 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండగా, టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి దాదాపు 24 గంటలకుపైగా సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. 


శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శనివారం వేంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పిలుస్తారు. ఈ క్రమంలో ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారాలను తెరిచిన అర్చకులు.. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి తొలి దర్శనం చేసుకున్నారు. 


బంగారు వాకిలి వద్ద వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. బంగారు వాకిలి వద్ద వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను సమర్పించారు. అనంతరం "నల్ల నువ్వుల బెల్లంతో " కలిపిన ప్రసాదాన్ని స్వామి వారిని నివేదించారు. 


తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది పరీక్షల ప్రక్రియ ఏప్రిల్ 30తో ముగియనుంది. పోలీసు కానిస్టేబుల్ (సివిల్), పోలీసు కానిస్టేబుల్(ఐటీ & సీవో) ఉద్యోగాల‌కు సంబంధించిన తుది రాత‌ప‌రీక్షల తేదీల‌ను తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఖ‌రారు చేసింది. ఏప్రిల్ 30న‌ ఈ రాత‌ప‌రీక్షల‌ను నిర్వహించాల‌ని నిర్ణయించింది. సివిల్ ఉద్యోగాల‌కు ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు, ఐటీ అండ్ సీవో ఉద్యోగాల‌కు మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. ఈ ప‌రీక్షల‌కు సంబంధించిన హాల్‌టికెట్ల‌ను ఏప్రిల్ 24 తేదీ ఉద‌యం 8 గంట‌ల నుంచి ఏప్రిల్ 28న అర్థరాత్రి 12 గంట‌ల వ‌ర‌కు సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసేప్పుడు ఏదైనా సమస్య తలెత్తినట్లయితే support@tslprb.in కు మెయిల్‌ లేదా 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొంది.


తిరుపతి జిల్లాలోని షార్‌ నుంచి పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (PSLV)-సి55 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రారంభమైంది. శనివారం మధ్యాహ్నం 2.20 గంటలకు పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలియోస్‌-2, 16 కిలోల లూమ్‌లైట్‌-4 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ55 కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. టెలియోస్‌-2 బరువు 741 కిలోలు. వీటి పనితీరు మొదలైతే అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ రాత్రింబవళ్లు కవరేజీ అందిస్తుంది. ఇ-నావిగేషన్‌ సముద్ర భద్రతను పెంచడం, ప్రపంచ షిప్పింగ్‌ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూరనుంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.