Andhra Pradesh Panchayat elections voters list:  ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సమరం మొదలుకానుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం,  రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుత సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2, 2026 నాటికి ముగుస్తుండటంతో, గడువులోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. 

Continues below advertisement

ఎన్నికల కసరత్తు ప్రారంభం                     

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం  2026 ఏప్రిల్ 2 తో ముగియనుండటంతో, రాజ్యాంగ నిబంధనల ప్రకారం గడువు ముగిసేలోపే కొత్త సభ్యుల ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే రంగంలోకి దిగి, జిల్లాల వారీగా అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా పంచాయతీల పునర్వ్యవస్థీకరణపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎన్నికల ప్రక్రియకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.

Continues below advertisement

 ఓటర్ల జాబితాపై ఈసీ ఆదేశాలు                     

ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా తయారీపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది.  మార్చి 9వ తేదీ నాటికి అన్ని గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. వార్డుల విభజన, ఓటర్ల నమోదు , అభ్యంతరాల స్వీకరణ వంటి ప్రక్రియలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా విభజన చేపట్టి, ఎక్కడా పొరపాట్లు లేకుండా చూడాలని యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

 ఏప్రిల్‌లో ముగియనున్న సర్పంచుల పదవీకాలం 

రాష్ట్రవ్యాప్తంగా 13,351కి పైగా గ్రామ పంచాయతీలలో 2021లో ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఈ ఏప్రిల్‌లో ముగియనుంది. పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టేలా ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఏప్రిల్ రెండో వారం నాటికి రాష్ట్రంలోని పల్లెల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.

 గ్రామాల్లో పెరిగిన రాజకీయ వేడి                    

ఎన్నికల సంకేతాలు రావడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కింది. ప్రభుత్వం క్లస్టర్ల విధానాన్ని తొలగించి, పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చడంతో పోటీ మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. రిజర్వేషన్ల ఖరారుపై కూడా కసరత్తు జరుగుతోంది. ఓటర్ల జాబితా విడుదలైన వెంటనే అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో, అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.