Prakasam Barrage : విజయవాడ వద్ద కృష్ణా నదిపై గల ప్రకాశం బ్యారేజి (Prakasam Barrage) ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజి(ICID)కు సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ (WHIS)అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖలో ప్రకాశం బ్యారేజీకి అవార్డు లభించినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ,సెంట్రల్ వాటర్ కమిషన్ ఇన్సిఐడి డైరెక్టర్ అవంతి వర్మ పేర్కొన్నారు. వ్యవసాయంలో సమర్ధవంతంగా నీటిని వినియోగించే హెరిటేజ్ స్ట్రక్చర్లను గుర్తించేందుకు  ఈరంగంలో పరిశోధనలు జరిపే పరిశోధకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఐసీఐడీ ఈ అవార్డులను ఏర్పాటు చేసిందని తెలిపారు. 


వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ -2023 అవార్డులకు ఐసీఐడీ, ఐఎన్సీడీల తరపున వచ్చిన నామినేషన్లలో 19 నిర్మాణాలను ఈ అవార్డులకు ప్యానల్ జడ్జెస్ సిఫార్సు చేసి ఎంపిక చేశారని, వాటిలో భారతదేశం నుంచి 4 నిర్మాణాలను ఈ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్-2023 అవార్డుకు ఎంపిక చేసినట్లు డైరెక్టర్ అవంతి వర్మ తెలియజేశారు. భారతదేశం నుంచి ఎంపికైన 4 నిర్మాణాలలో కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజి(Prakasam Barrage)తో పాటు ఒడిశా లోని బలిద్హిహా(Balidiha)ప్రాజెక్టు, జయమంగళ ఆనకట్టలు, తమిళనాడులోని శ్రీవాయికుంటం(Srivaikuntam) ఆనకట్ట ఈఅవార్డుకు ఎంపికైనట్టు తెలిపారు. ఈ విధంగా ఎంపికైన నిర్మాణాలను వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్లకు సంబంధించిన ఐసీఐడీ రిజిష్టర్లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


ఈ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అవార్డుకు ఎంపికైన రాష్ట్రాలకు నవంబరు 2 నుంచి 8 వరకూ విశాఖపట్నంలో జరిగే 25వ ఐసీఐడీ కాంగ్రెస్, 74వ ఐఈసీ సమావేశంలో ఈ అవార్డులను ఆయా రాష్ట్రాలకు ప్రదానం చేయనున్నట్టు డైరెక్టర్ అవంతి వర్మ తెలియ జేశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఆహ్వానపత్రికను త్వరలో ఆయా రాష్ట్రాలకు పంపడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డులకు ఎంపికైన రాష్ట్రాలు 25వ ఐసీఐడీ కాంగ్రెస్, 74వ ఐఈసీ సమావేశానికి హాజరయ్యేందుకు రిజిష్టర్ చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ణప్తి చేశారు.