Akividu tension:  పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రామాలయం వివాదం,  రాజకీయ ఉద్రిక్తతల కారణంగా కొంత మంది సోషల్ మీడియాలో చలో ఆకివీడుకు పిలుపునిచ్చారు. అయితే ఎవరు పిలుపునిచ్చారో స్పష్టత లేదు. రఘురామకృష్ణరాజు కూడా ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ  కార్యక్రమానికి అనుమతి లేదని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు  ప్రకటించారు.  పట్టణంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ముందస్తు జాగ్రత్తగా  144 సెక్షన్, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. 

Continues below advertisement

ఆకివీడులో ఈ స్థాయి ఉద్రిక్తతకు ప్రధాన కారణం ఇటీవల అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పర్యటనలో చోటుచేసుకున్న ఘర్షణలే. పెద్దపేటలోని పురాతన రామాలయ పునర్నిర్మాణం విషయంలో  వివాదం, రాజకీయ దాడులకు దారితీసింది. రఘురామ అనుచరులపై జరిగిన దాడిని నిరసిస్తూ  కొన్ని హిందూ సంఘాలు చలో ఆకివీడు కు పిలుపునిచ్చినట్లుగాప్రచారం జరిగింది. ఇప్పటికే ఈ దాడికి సంబంధించి 21 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో 50 మందిపై కేసులు నమోదయ్యాయి.   

డీఎస్పీ రఘువీర్ విష్ణు మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.  పట్టణంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. శాంతికి విఘాతం కలిగించాలని చూసే వారిపై, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠినమైన  భారతీయ న్యాయ సంహిత  నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, బయటి వ్యక్తులు పట్టణంలోకి రాకుండా ఆంక్షలు విధించారు.

ప్రస్తుతం ఆకివీడులో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని, టెక్నికల్ ఆధారాలతో నిందితులందరినీ బయటకు తీస్తామని చెబుతుండగా.. ప్రభుత్వం మాత్రం ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అప్రమత్తమైంది. ప్రజలు పోలీసులకు సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టులు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.