Pawan On Byjus in AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బైజూస్ అనే ఎడ్‌టెక్ సంస్థతో చేసుకున్న ఒప్పందంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శలు కొనసాగిస్తున్నారు. బైజూస్ తో ఒప్పందంపై ఆదివారం మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక మెగాడీఎస్సీని ప్రకటించలేదని.. ఒక్క టీచర్ ని కూడా రిక్రూట్ చేయలేదని ఇదివరకే పవన్ విమర్శించారు. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఓ స్టార్టప్‌కు మాత్రం వందల కోట్లు కాంట్రాక్టులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అసలు ఎన్ని కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి, చివరగా బైజూస్ కు ఎలా కేటాయింపులు జరిగాయో ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు. 


మీ సీఎంలాగ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదు.. 
పవన్ కు తాను ట్యూషన్ చెబుతానని, ఎప్పటి హోంవర్క్ అప్పుడు చేయాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ట్వీట్ చేశారు. తాను ఏడు పాఠాలను చెబుతున్నానని, ఆ హోంవర్క్ కంప్లీట్ చేయాలంటూ బొత్స చేసిన ట్వీట్ పై జనసేనాని తనదైన రీతిలో మరో కౌంటరిచ్చారు. బైజూస్ తో ఒప్పందంపై కీలక విషయాలు ప్రస్తావిస్తూనే, విలువైన ప్రశ్నలు లేవనెత్తారు. తనపై విమర్శలు చేసిన మంత్రి బొత్సను టార్గెట్ చేస్తూ పవన్ ట్వీట్ల వర్షం కురిపించారు. మీ సీఎంలాగ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాకపోవచ్చు. ఏపీలోని విద్యార్థులు బెస్ట్ ఎడ్యుకేషన్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాంటూ జగన్ పై సెటైర్లు వేశారు.  దాంతో బైజూస్ వివాదం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.


బైజూస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందానికి సంబంధించి కొన్ని విషయాలు నోట్ చేసుకోవాలంటూ కీలక అంశాలు లెవనెత్తారు జనసేనాని. 1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 ఉంటుంది. 2. బైజూస్ CEO రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)  లో భాగంగా 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా కంటెంట్ లోడ్ చేసి ఇస్తామని ఒప్పుకున్నారు. 3. వచ్చే సంవత్సరం మళ్ళీ ప్రభుత్వం 580 కోట్ల ఖర్చుతో 5 లక్షల ట్యాబ్లెట్లు కొననుందా? అని కీలక అంశాలు లెవనెత్తుతూ పవన్ ట్వీట్ చేశారు.






ప్రశ్నించదగిన అంశాలు అంటూ మరిన్ని అంశాలను ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. 1. బైజూస్ కంటెంట్ కోసం వచ్చే సంవత్సరం నుండి ఖర్చు ఎవరు చెల్లిస్తారు? కంపెనీ వారు ప్రతీ సంవత్సరం ఉచితంగా ఇస్తారా? ఈ విషయంలో క్లారిటీ లోపించిందన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం బైజూస్ వారు కంటెంట్ లోడ్ చేసిన ట్యాబ్లెట్లు ఉచితంగా ఇస్తారని ప్రభుత్వం చెప్పింది. కానీ బైజూస్ సంస్థ మాత్రం ఎక్కడా ఇప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెప్పలేదు అనేది పవన్ వాదన.






2. ఒకవేళ కంపెనీ వారు ఖర్చు భరించకపోతే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? AP ప్రభుత్వమా లేక విద్యార్థులా? ఒకవేళ ప్రభుత్వం భరిస్తే మరో 750 కోట్లు బైజూస్ కంటెంట్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది (ఒక్కో విద్యార్థికి 15 వేల చొప్పున * 5 లక్షల విద్యార్థులు = 750 కోట్లు). క్లారిటీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 3. 8వ తరగతి నుండి 9వ తరగతికి విద్యార్థులు వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏంటి? 9వ తరగతి కంటెంట్ ఖర్చు ఎవరు భరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 4. బైజూస్ సంస్థ వారు ఏ మాధ్యమంలో, ఏ సిలబస్ అందజేస్తారు? వారు ఏ విధానం ఆధారంగా సిలబస్ రూపొందిస్తున్నారు? CBSC/స్టేట్ సిలబస్ లేదా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్నారా? దీనికి జవాబు: CBSE సిలబస్ ఆధారంగా కంటెంట్ రూపొందించాం అని సంస్థ వారు పేర్కొన్నారని తన ట్వీట్లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.