Pithapuram spiritual tourist destination: ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని పవన్ కల్యాణ్ అధికారుల్ని ఆదేశించారు. ప్రఖ్యాత ఆలయాలతోపాటు నియోజకవర్గంలో జీర్ణావస్థకు చేరిన ఆలయాలను ఇప్పటికే గుర్తించామనీ, వాటికి పునరుజ్జీవం కల్పించే పనులుకు అవసరమైన నిధులు దేవాదాయ శాఖ సమకూరుస్తుందని తెలిపారు. దేవాదాయ శాఖ సహకారంతో ఆలయాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి అన్నారు. ప్రధాన ఆలయాలు అయిన శ్రీ పురూహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద శ్రీ వల్లభస్వామి ఆలయాలతోపాటు 19 ఆలయాల అభివృద్ధి నిమిత్తం కామన్ గుడ్ ఫండ్ నుంచి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు ఇప్పటికే దేవాదాయ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందనీ, మ్యాచింగ్ గ్రాంట్ తో నిధులు మంజూరు చేస్తారన్నారు.
ఇందులో రూ.6 కోట్లు శ్రీ పురూహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి కేటాయిస్తున్నారన్నారు. మరో నాలుగు ఆలయాలను ధూప దీప నైవేధ్యం పథకం పరిధిలోకి తీసువస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. శుక్రవారం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమీక్ష చేశారు. కార్తీక మాసంలో ఆలయాల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. చివరి కార్తీక సోమవారం సందర్భంగాను, కార్తీక మాసం ముగిసే రోజునా ఆలయాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండవచ్చనీ, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మహిళా భక్తులకు దర్శనాలు, పూజల దగ్గర ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆలయాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కుక్కుటేశ్వర స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా సుమారు రూ.6 కోట్లు వెచ్చించి పిండ ప్రదాన మండపం, అన్నదాన మండప నిర్మాణంతోపాటు కోనేరు మరమ్మతులు చేపట్టేందుకు కామన్ గుడ్ ఫండ్ నుంచి ఇప్పటికే నిధులు మంజూరు చేసేందుకు దేవాదాయ శాఖ ఆమోదం లభించింది. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆలయం అభివృద్ధికి రూ.2 కోట్లు కామన్ గుడ్ ఫండ్ ద్వారా మ్యాచింగ్ గ్రాంట్ తో మంజూరు అయ్యింది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అయిన శ్రీ పురూహుతికా అమ్మవారి ఆలయ అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం చేయిస్తున్నాం. పిఠాపురం శ్రీ సీతారామాంజనేయ ఆశ్రమం అభివృద్ధికి రూ.60 లక్షలు, శ్రీ జై గణేష్ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.65 లక్షలు, చిత్రాడలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.70 లక్షలు కామన్ గుడ్ ఫండ్ నుంచి నిధులు ఇచ్చేందుకు దేవాదాయ శాఖ అంగీకరించింది. వీటితోపాటు జీర్ణావస్థకు చేరిన పలు ఆలయాలను అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ ముందుకు వచ్చిందని తెలిపారు.
పిఠాపురం మండలం నవ ఖండ్రవాడలోని శ్రీ నక్కుల్లమ్మ అమ్మవారి ఆలయం, శ్రీ రామాలయం, గొల్లప్రోలు శ్రీ సిరితల్లి ఆలయం, తాటిపర్తిలోని శ్రీ మార్కండేయసహిత భద్రావతి భావనరుషి స్వామి వారి ఆలయాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ధూప దీప నైవేద్యం పథకం పరిధిలోకి తీసుకునేందుకు దేవాదాయ శాఖ అంగీకారం తెలిపింది. సనాతన ధర్మానికి ప్రతీకలుగా నిలిచే ఆలయాల పరరక్షణ అందరి బాధ్యత. ఆలయాల పరిరక్షణ, భద్రత, అభివృద్ధికి అధికారుల బాధ్యతల నిర్వహణతోపాటు ప్రజల భాగస్వామ్యం కూడా కీలకం” అని గుర్తు చేశారు.