Chilakaluripet school: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మాట ప్రకారం చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లైబ్రరీ మరియు 25 కంప్యూటర్లను సొంత నిధులతో అందజేశారు. డిసెంబర్ 5వ తేదీన శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన టీచర్స్-పేరెంట్స్ మీటింగ్కు ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యార్థుల అభ్యర్థన మేరకు లైబ్రరీ మరియు 25 కంప్యూటర్లను తన సొంత నిధులతో అందజేస్తానని హామీ ఇచ్చారు.
ఆ మాటకు కట్టుబడి, కేవలం పది రోజుల్లోనే అవసరమైన పుస్తకాలు, బుక్ రాక్స్ మరియు 25 కంప్యూటర్లను పాఠశాలకు పంపించారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ, పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల, ఆర్డీఓ మధులత, మండల విద్యాశాఖ అధికారులు, తాహశీల్దార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయినీలు, ఉపాధ్యాయులు , పాఠశాల విద్యా కమిటీ సభ్యులు ఈ లైబ్రరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వారంతా కలిసి లైబ్రరీ , కంప్యూటర్ ల్యాబ్ను రిబ్బన్ కట్టింగ్ చేసి ప్రారంభించారు.
పాఠశాల విద్యార్థులు ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మా కోసం ఇంత చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు. ఈ విరాళం విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలను అందించడమే కాకుండా, ప్రభుత్వం విద్యా అభివృద్ధి పట్ల నిబద్ధతను చాటుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో కూడా వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని, విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా కూడా తన సొంత నిధులతో ఈ సహాయం చేయడం ద్వారా ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు. పల్నాడు జిల్లాలో విద్యా రంగం మరింత అభివృద్ధి చెందేలా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని స్థానికులు కోరుకుంటున్నారు.