Pawan Kalyan  announced that he will not give up Bhimavaram  :  పవన్ కల్యాణ్ భీమవరం నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం మళ్లీ ప్రారంభమయింది. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది.  ఈ క్రమంలో  భీమవరం నుంచి మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు జనసేనలో చేరారు. టీడీపీకి చెందిన ఆయన జనసేనలో చేరడంతో.. ఆయనే అభ్యర్థి అనుకున్నారు. కానీ తాను పోటీ చేయడం లేదని.. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారని రామంజినేయులు స్టేజి మీద చెప్పారు. తన ప్రసంగంలో పవన్ కల్యాణ్ కూడా.. అదే తరహాలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో జనసేన భీమవరాన్ని కొట్టి తీరాలి. భీమవరంలో జనసేన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. భీమవరాన్ని నేను వదలను అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. 
 
భీమవరంలో గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది !  
 
 ”గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేస్తే.. బంధుత్వాల పేరుతో ఇబ్బంది పెట్టారు. యుద్దం చేయనీకుండా నాకు సంకెళ్లు వేశారు. భీమవరంలో కంటే పులివెందులలో పోటీ చేసి ఉంటే బాగుండేదని అనుకున్నా. పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోయి ఉన్నా.. నేను బాధపడేవాడిని కాదు. సీట్లు తగ్గిపోయాయని కొందరు బాధపడుతున్నారు. కానీ గతంలో నా ఒక్క సీటు గెలిచి ఉంటే.. ఇవాళ పరిస్థితి వేరేగా ఉండేది. గతంలో జరిగిన తప్పిదాలకు నేను పరిహరం కడుతున్నానని వ్యాఖ్యానించారు. ల భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి.. పొత్తులను ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి నేను ఓడిపోతే.. నాపై పోటీ చేసిన రామాంజనేయులు చాలా బాధపడ్డారు. భీమవరంలో పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికి కూడా స్థలం ఇవ్వకుండా ఎమ్మెల్యే గ్రంధి అడ్డుకున్నారు. నేను పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికే గ్రంధి శ్రీనివాస్ అడ్డుకున్నారంటే.. ఎంత రౌడీయిజం చేస్తున్నారో అర్థం చేసుకోవాలని సూచించారు. 


భీమవరంలో గెలిచి తీరాలి  ! 


గ్రంధి శ్రీనివాసును అక్కడి నుంచి తరిమేయాలి. గ్రంధి భీమవరంలో చాలా మందికి బంధువే. మన కులస్తుడని గ్రంధిని వదిలేయాలా..? ఓ వీధిరౌడీని ఎమ్మెల్యే చేయడం వల్ల భీమవరంలో నిమ్మకాయ షోడా అమ్ముకునే వ్యక్తిని కూడా బెదిరించే పరిస్థితి వచ్చింది. తన డ్రైవరును చంపి డోర్ డెలివరి చేసిన అనంతబాబు మన కులస్తుడేనని వదిలేస్తామా..?జైలుకెళ్లిన అనంతబాబు బెయిల్ మీద వస్తే.. బాస్ ఈజ్ బ్యాక్ అనడం కరెక్టేనా..? పార్టీ పెట్టడానికి సొంత అన్నను కూడా కాదని వచ్చాను. సొంత అన్నను ఇబ్బంది పెట్టే వచ్చాను.  నేను గెలిచి ఉంటే భీమవరంలో డంపింగ్ యార్డును తొలగించేవాడిని. నేను చాలా హ్యాండ్సమ్ పొలిటిషీయన్ను. పద్దతిగా మాట్లాడతాను.. కానీ ఎదుటి వాళ్లు యుద్దం కోరుకుంటే నేను దానికి రెడీ సిద్దం.. సిద్దం అంటూ జగన్ కోకిలలా కూస్తున్నాడు. జగన్ తో యుద్దానికి సిద్దం. యుద్దం అంతిమ ఫలితం ప్రక్షాళనే. జగన్ జలగలను తీసేస్తాం.. భీమవరంలో ఉన్న జగన్ జలగ గ్రంధిని తీసేస్తాం. కాపు కులస్తుడని గ్రంధిని వెనకేసుకు వస్తే.. ఆ ప్రభావం కులం మీద పడుతుంది.. ఆలోచించాలి. గొడవలు పెంచే వారు నాకొద్దు.. తగ్గించేవారు కావాలి. అందుకే రామాంజనేయులను పార్టీలోకి ఆహ్వానించానని స్పష్టం చేశారు. 


అన్ని  స్థానాల్లో పోటీ చేస్తోంది  బీజేపీ, జనసేన , టీడీపీ కూటమే ! 


 ”నేను తీసుకున్న సీట్లు తక్కువా.. ఎక్కువా.. అనేది పక్కన పెట్టండి. జనసేన, టీడీపీ, బీజేపీలు 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాయని భావించాలి. జగన్ అధికారంలో ఉండకూడదు. ఒక్కడి దగ్గర ఇంత సంపద ఉండకూడదు. జగన్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికే కాదు.. దేశానికే ముప్పు. ఏపీలో జగన్ పోవాలి.. భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ పోవాలి. వ్యూహం నాకొదిలేయండి. టైమింగ్ నాకొదిలేయండి. వాళ్లను వ్యూహం సినిమా తీసుకోమనండి.. మనం వ్యూహం వేద్దాం. ఏపీనే కాపాడుకునేవాడిని.. భీమవరాన్ని కాపాడుకోలేనా..?” అని జనసేనాని అన్నారు.