Pawan Kalyan:  ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రముఖ జాతీయ వార్తా సంస్థ  ANI  పాడ్‌కాస్ట్‌లో  దేశ రాజకీయాలపై అత్యంత కీలకమైన, సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ , తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తుతున్న  ఉత్తరాది వర్సెస్ దక్షిణాది వివాదాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఒక జాతీయ పార్టీ అయి ఉండి కూడా కాంగ్రెస్ ప్రాంతీయ పక్షపాతాన్ని, సంకుచిత సెంటిమెంట్లను ప్రోత్సహించడం విడ్డూరంగా ఉందన్నారు. దశాబ్దాలుగా హైదరాబాద్‌లోనే ఉంటూ, ఇక్కడి సమాజంతో మమేకమైన తనను కాంగ్రెస్ నేతలు కొందరు అవుట్‌సైడర్  అని పిలవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు చిల్లర శక్తులను నాపైకి పంపుతూ హైదరాబాద్‌లో అడుగుపెట్టలేవని బెదిరిస్తున్నారని, నా మాతృభూమిలో నేను ఎక్కడికి వెళ్లాలో చెప్పడానికి ఇది ఎవరి జాగీరు కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Continues below advertisement

రాహుల్ గాంధీ కూడా దక్షిణాది వ్యక్తి కాదు ! 

ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "కాంగ్రెస్ పార్టీ గనుక ప్రాంతీయ పక్షపాతంతో నన్ను హైదరాబాద్ రాకూడదని చెబితే, అప్పుడు నేను కూడా రాహుల్ గాంధీకి ఒక విషయం చెప్పాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ కూడా భారతదేశంలోని దక్షిణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు.. ఆయన ఉత్తరాది వ్యక్తి, మరి ఆయన ఇక్కడికి ఎలా వస్తారు, ఎలా పోటీ చేస్తారు?" అని పవన్ ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులు, జాతీయ విలువల గురించి మాట్లాడే ఒక జాతీయ పార్టీ హఠాత్తుగా ఇటువంటి సంకుచిత రాజకీయాలకు పాల్పడటం దేశ సమగ్రతకే ప్రమాదకరమని హెచ్చరించారు. తన మాతృభూమిలో తాను ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకు ఉందని, ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.   

Continues below advertisement

దేశాన్ని విభజించేలా మాట్లాడకూడదు! 

ఇక దేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న నియోజకవర్గాల పునర్విభజన  అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ వంటి దక్షిణాది నేతలు వ్యక్తపరుస్తున్న ఆందోళనలపై పవన్ కల్యాణ్ స్పందించారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు.. నియోజకవర్గాల విభజన వల్ల లోక్‌సభ స్థానాలను, రాజకీయ ప్రాధాన్యతను కోల్పోతామనే భయాన్ని వ్యక్తపరచడంలో ఒక తార్కిక అర్థం  ఉందని ఆయన అంగీకరించారు. అయితే, పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా సీట్లను దామాషా ప్రకారం పెంచుతామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ సమస్యను కేవలం సాంకేతిక, పరిపాలనాపరమైన కోణంలో చర్చించి పరిష్కరించుకోవాలే తప్ప, దానిని సాకుగా తీసుకుని ఉత్తరాది - దక్షిణాది విభేదాలను మధ్యలోకి తీసుకురావాల్సిన అవసరం ఎక్కడుందని ఆయన నిలదీశారు.

ప్రాంతీయవాదం..తీవ్రవాదం కంటే ప్రమాదకరం

ప్రాంతీయవాదం అనేది కొన్నిసార్లు తీవ్రవాదం కంటే ప్రమాదకరంగా మారుతుందని, అది దేశ ఐక్యతను దెబ్బతీస్తుందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రులు దేశాన్ని ముక్కలు చేసే విధంగా మాట్లాడటం సరికాదని, అటువంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గుజరాత్ నుండి వచ్చారని, యావత్ దేశాన్ని ఏకం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మాతృభాష కూడా హిందీ కాదని గుర్తు చేశారు. భాష, ప్రాంతాల పేరుతో విభజన రాజకీయాలు చేస్తే చివరకు సైన్యం కూడా సరిగ్గా పనిచేయలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఒకవేళ దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక సహకారం, పన్నుల గురించి మాట్లాడితే.. రేపు ఉత్తరాది రాష్ట్రాలు వచ్చి 'దేశ సరిహద్దుల్లో కాపలా కాసే ఎక్కువ మంది సైనికులను మేము అందిస్తున్నాం' అని వాదిస్తే దానికి ముగింపు ఎక్కడ ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.  

వ్యక్తిగత విషయాలనూ పంచుకున్న పవన్ 

ఈ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత ఆలోచనలను, యువత మానసిక స్థితిని కూడా పంచుకున్నారు. ప్రస్తుత తరం యువతకు ఈ ఉత్తర-దక్షిణ ఘర్షణలపై ఎలాంటి ఆసక్తి లేదని, వారు కేవలం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ప్రాథమిక అవసరాల గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఇలాంటి విభేదాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తాను చిన్నప్పటి నుండి గట్టి జాతీయవాద  ) భావజాలంతో పెరిగానని, దేశ ప్రయోజనాలే తనకు అన్నింటికంటే మిన్న అని స్పష్టం చేశారు. తనకు తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేకపోయినప్పటికీ, 2007 నుండి తన వెంటే నడుస్తున్న కరడుగట్టిన తెలంగాణ యువత, జనసేన క్యాడర్ అక్కడ బలంగా ఉన్నారని.. వారి ద్వారా తెలంగాణ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు.