Bengal Egg Attacks : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడూ వేడివేడిగా, హింసాత్మక ఘర్షణలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో అక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుని సరికొత్త నిరసన సంస్కృతి తెరపైకి వచ్చింది. అదే  కోడిగుడ్ల దాడుల  పర్వం. తాజాగా నదియా జిల్లా కృష్ణనగర్‌ లోని మాజీ మంత్రి, సీనియర్ టీఎంసీ నేత ఉజ్జల్ బిస్వాస్ నివాసంలో జరిగిన హైడ్రామా బెంగాలీ మీడియాలో పెను సంచలనంగా మారింది. వరద బాధితులకు పంచాల్సిన ప్రభుత్వ సామాగ్రిని   తన ఇంట్లో అక్రమంగా దాచారంటూ ఆగ్రహించిన స్థానికులు, నిరసనకారులు ఆయన ఇంట్లోకి చొరబడి.. కుర్చీలో కూర్చున్న ఆయన ముఖంపై కోడిగుడ్లతో కొట్టి,  దొంగ.. దొంగ  అంటూ నినాదాలు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ హైడ్రామా జరిగిన కొన్ని గంటల్లోనే కోల్‌కతా పోలీసులు ఆయనను అధికారికంగా అరెస్ట్ చేశారు.  

Continues below advertisement

ఈ మొత్తం వివాదానికి మూలం టార్పాలిన్‌ల దుర్వినియోగం కేసు. బెంగాల్‌లో వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పేద ప్రజలకు పంపిణీ చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున  టార్పాలిన్లు,  ధోతీలు, శారీలను సరఫరా చేస్తుంది. అయితే, కృష్ణనగర్ సౌత్ మాజీ ఎమ్మెల్యే, మాజీ జైళ్ల శాఖ మంత్రి అయిన ఉజ్జల్ బిస్వాస్ నివాసం నుండి మంగళవారం మధ్యాహ్నం భారీ ఎత్తున ఈ ప్రభుత్వ మెటీరియల్‌ను ఒక గూడ్స్ వాహనంలోకి తరలిస్తుండటాన్ని స్థానిక ప్రజలు బీజేపీ శ్రేణులు గమనించారు. ప్రభుత్వ సొమ్మును అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే సమాచారం క్షణాల్లో దావానలంలా వ్యాపించడంతో వందలాది మంది ఆయన ఇంటిని ముట్టడించారు. ఆఫీస్ రూమ్‌లోకి దూసుకెళ్లి ఫైళ్లను పారేసి, చివరకు ఆయన ముఖంపై గుడ్లు విసిరి తమ కసితీర్చుకున్నారు. 

Continues below advertisement

 ఇది కేవలం ఒక ఉజ్జల్ బిస్వాస్ సమస్య మాత్రమే కాదు. బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ నేతలకు   కుళ్లిన కోడిగుడ్ల  రుచి చూపించడం ఒక ట్రెండ్‌లా మారిపోయింది. గత కొన్ని వారాలుగా టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు ఎక్కడ ప్రజా క్షేత్రంలోకి వచ్చినా స్థానికులు గుడ్లతో దాడులు చేస్తున్నారు. పార్టీ అగ్రనేత అభిషేక్ బెనర్జీపై మొదలైన ఈ  ఎగ్ ఎటాక్  సంస్కృతి.. ఇప్పుడు గ్రామస్థాయి నేతల వరకు పాకింది. నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి ఈ కోడిగుడ్ల దాడులు ఒక ప్రతీకగా మారుతున్నాయి.   

మరోవైపు, ఈ అరెస్టులు,  దాడుల వెనుక పెద్ద రాజకీయ చదరంగమే నడుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉజ్జల్ బిస్వాస్ బీజేపీ అభ్యర్థి సాధన్ ఘోష్ చేతిలో ఓడిపోయారు. అధికారం కోల్పోయిన వెంటనే ఇలాంటి అవినీతి అస్త్రాలు బయటకు రావడంపై టీఎంసీ వర్గాలు మండిపడుతున్నాయి. ఉజ్జల్ బిస్వాస్ కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు. ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా తన కోటాకు సంబంధించిన సామాగ్రిని ప్రజలకు పంచడానికే ఇంట్లో ఉంచారని.. వాటిని తిరిగి జిల్లా యంత్రాంగానికి అప్పగించడానికి సిద్ధమవుతుండగా, బీజేపీ కావాలనే ప్లాన్ ప్రకారం దాడి చేయించిందని ఆరోపిస్తున్నారు. అయితే, ఇదే రోజున మరో మాజీ మంత్రి ఇంద్రనీల్ సేన్‌పై కూడా దుర్గాపూజ నిధుల దుర్వినియోగం కేసు నమోదు కావడం, గతంలోనే సుజిత్ బోస్ వంటి నేతలు అరెస్ట్ కావడం చూస్తుంటే.. టీఎంసీని లీగల్‌గా, పబ్లిక్‌గా కార్నర్ చేయడంలో బీజేపీ సక్సెస్ అవుతోంది.  

ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించాల్సింది పోయి.. ఇలా ఇళ్లల్లోకి చొరబడి భౌతిక దాడులకు దిగడం, కోడిగుడ్లు విసరడం లాంటి సంఘటనలు శాంతిభద్రతల సమస్యను మరింత జటిలం చేస్తాయని తృణమూల్ నేతలంటున్నారు.   ప్రజా గ్రహాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని వీధుల్లో రచ్చ చేయడం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయ క్షేత్రం మరిన్ని కోడిగుడ్ల దాడులకు, అరెస్టుల పర్వానికి వేదిక కాబోతోందని స్పష్టమవుతోంది.