Andhra Pradesh Voting Day: అమరావతి:  మే 13న ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవును ఎన్నికల కమిషన్ మంజూరు చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అండ్ ప్రభుత్వ ఈవో ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా శనివారం ఈమేరకు ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేశారు.


భారత ఎన్నికల సంఘం (Election Commission Of India) సూచనల మేరకు  జిఓ ఆర్టి నెంబర్ 845, మే 4వ తేదీన జారీ చేశారు. ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ (Postal ballot) ద్వారా ఓటు వేయడానికి వీలుగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల అభ్యర్థన మేరకు సంబంధిత అధికారులు ఒకరోజు ప్రత్యేక క్యాజువల్ సెలవును మంజూరు చేయాలని  ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సెక్రటేరియట్ విభాగాలు/ విభాగాల అధిపతి/ జిల్లా కలెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులు అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని తాజాగా ఉత్తర్వులలో సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.