Movie On Rambabu :  తిరుపతిలో జనసేన పార్టీ నేతలు కొత్త సినిమా నిర్మాణాన్ని ప్రారంభించారు. దాని పేరుతో ట్రిపుల్ ఎస్.  పూర్తి పేరు సందులో సంబరాల రాంబాబు. ఈ పేరు వింటే ఎవర్ని టార్గెట్ చేసి తీస్తున్నారో సులువుగా అర్థం చేసుకోవచ్చు. కొద్ది రోజులుగా అంబటి రాంబాబు, జనసేన మధ్య వివాదం తీవ్రం అవుతోంది. పవన్ పై అంబటి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన నేతలు వెంటనే సినిమా నిర్మాణం ప్రారంభించారు. 


అంబటిపై తిరుపతి జనసేన నేతల సెటైర్ 


బ్రో సినిమా విడుదల నాటి నుంచి నేటి వరకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు వర్సెస్ జనసేన  వివాదం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా వైసీపీ  , జనసేన నాయకులు  తీవ్ర స్ధాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బ్రో సినిమాలో నట్టు పృథ్వీరాజ్ చేసిన సన్నివేశం తనను ఇమిటేట్ చేశారంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలతో వివాదం మరింతగా ముదిరింది.. ఈ క్రమంలో జనసేన  అధినేత పవన్ కళ్యాణ్ పై మీడియా ముఖంగా అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.  బ్రో సినిమా ఒక పెద్ద కుంభకోణానికి వేదికని చెప్పడంతో పాటుగా, అమెరికాలో బాబు ముఠా వసూలు చేసిన డబ్బుతో నిర్మాత ద్వారా పవన్‌కు ప్యాకేజీ ఇచ్చిన్నట్లు ఆరోపణలు గుప్పించారు. పవన్ పై ఓ సినిమా తీసి మహిళా లోకం మెచ్చుకునేలా ఓ సినిమా తీసి ఆ సినిమా క్లైమాక్స్‌లో ఆయనకు గుణపాఠం చెబుతామన్నారు.ఈ సినిమాకు ‘నిత్య పెళ్ళికొడుకు.. పెళ్ళిళ్ళు–పెటాకులు, తాళి–ఎగతాళి పేర్లు పరిశీలిస్తున్నామని తెలిపారు.


అంబటికి కౌంటర్ గా జనసేన సినిమా  


అంబటి వ్యాఖ్యలపై జనసేన నాయకులు తీవ్రస్థాయిలో  మండిపడ్డారు.  అంబటి రాంబాబు స్టైల్ లోనే గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యామని అంటున్నారు. తిరుపతిలోని బైరాగి పట్టెడలో అంబటి రాంబాబు పై ప్రొడక్షన్ నెంబర్ 6096 పేరిట జగ్గు భాయ్ సమర్పించు ఎస్ఎస్ఎస్ సందులో సంబరాల రాంబాబు అనే చిత్రాన్ని తరికేకిస్తున్నట్లు తిరుపతి జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు. సినిమాలు తీయాలంటే మెగా ఫ్యామిలీ తర్వాతనే ఎవరైనా అని ఆయన స్పష్టం చేశారు. అంబటి రాంబాబుకు తన శాఖలో ఏవేమి అంశాలు ఉన్నాయో తెలియదని., కేవలం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడానికె మంత్రి పదవి ఇచ్చారంటూ విమర్శలు చేశారు. 


అంబటికి తన శాఖ గురించే తెలియదన్న జనసేన


జలవనరుల మంత్రిగా ఉన్న అంబటికి కాఫర్ డ్యాం అంటే తెలియదు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేరు గాని పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడానికి మాత్రం ప్రెస్ మీట్ లు పెట్టడానికి ముందుంటారని అన్నారు. సంబరాల రాంబాబు పై ప్రస్తుతం జగ్గు భాయ్ సమర్పించు ఎస్ఎస్ఎస్ సినిమా తీస్తున్నామని ఈ సినిమా మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందు రానుందని తెలిపారు. సంబరాల రాంబాబు నోరు అదుపులో పెట్టుకోకుంటే త్రిబుల్ ఎక్స్ సినిమా తీయడానికైనా వెనుకాడమని..... మేము తీసే సినిమాలో సుకన్య, సృజన పాత్రల కోసం అన్వేషిస్తున్నట్టు జనసైనికులు తెలిపారు.