ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారని, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను ఒడిస్సా, భువనేశ్వర్, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలోని వివిధ ఆసుపత్రులకు తరలించిన అనంతరం మంత్రి అమర్నాథ్ ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం ఆదివారం (జూన్ 4) ఉదయం బాలాసోర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లో 309 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు ప్రయాణిస్తున్నారని, ఏపీ నుంచి హౌరా వైపు 33 మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఈ 342 మందిలో 330 మందిని గుర్తించామని పేర్కొన్నారు. ఇందులో ఇప్పటివరకు 331 మందిని గుర్తించామని, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందని ఆయన తెలియజేశారు. 


గుర్తించిన వారిలో 14 మంది క్షతగాత్రులని, వీరిలో 10 మంది రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో, నలుగురు క్షతగాత్రులు జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నారని చెప్పారు. ఇదే కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్న గురుమూర్తి అనే ఒక వ్యక్తి మాత్రం మరణించారని అమర్నాథ్ వెల్లడించారు. కాగా, ఇంకా గుర్తించవలసిన వారి వివరాల కోసం అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ లలో తమ వారు కనిపించడం లేదని ఇప్పటివరకు ఎవరూ రాలేదని, ఇప్పటికీ తమ వారి ఆచూకీ కోసం  8333905022 అన్న వాట్సాప్ నెంబర్ కు ఆచూకీ లభ్యం కాని వారి ఫోటోలు పంపిస్తే అధికారులు వారి వివరాలు సేకరిస్తారని మంత్రి అమర్నాథ్ చెప్పారు.


ఇలా ఉండగా రాష్ట్రానికి చెందిన 16 అంబులెన్స్ లను, 10 మహాప్రస్థానం వాహనాలను భువనేశ్వర్ లో అందుబాటులో ఉంచామని, మరో ఐదు అంబులెన్సులను బాలాసోర్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొంతమందిని భువనేశ్వర్ లోని అపోలో హాస్పిటల్ తరలించామని, ఇద్దరిని విశాఖలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లామని చెప్పారు. ఒకరిని విశాఖ ఆరిలోవలోని అపోలో హాస్పిటల్ కు తరలించామని తెలియజేశారు.


శ్రీకాకుళానికి చెందిన ఒకరు మృతి


ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందారు. సంతబొమ్మాళి మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన గురుమూర్తి (63) నిన్న బాలేశ్వర్ దగ్గర జరిగిన ప్రమాదంలో మరణించగా  ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. బాలేశ్వర్లో నివసిస్తున్న గురుమూర్తి ఈనెల 1వ తేదీన పింఛన్ కోసం స్వగ్రామానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ముందుగా విశాఖ ఎక్స్ప్రెస్ లో భువనేశ్వర్ వరకు వెళ్లి అక్కడ నుండి బాలేశ్వర్ కు యశ్వంత్ పూర్ సూపర్ ఫాస్ట్ లో బయలుదేరాడు. ప్రయాణ సమయంలో రైలు ప్రమాదం జరగడంతో చనిపోయారు.