పెళ్ళి మండపాల వద్ద హిజ్రాలు అసభ్యంగా ప్రవర్తిస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏలూరు జిల్లా పోలీసులు సూచించారు. ఏలూరు జిల్లా నూజివీడులోని ఓ వివాహ వేదిక వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ అతిథుల ముందు అసభ్యంగా ప్రవర్తించిన హిజ్రాలపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు ఇవ్వకపోతే లేదా అడిగినంత ఇవ్వకపోతే శుభకార్యానికి వచ్చిన వారిని దుర్భాషలాడుతున్నారు హిజ్రాలు. ముసునూరు మండలం కాట్రేనిపాడులో నిశ్చితార్థ కార్యక్రమంలో రూ.11 వేల రూపాయల డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వనందుకు ఇంటి యజమాని శుభకార్యానికి వచ్చిన ప్రతి ఒక్కరిని హిజ్రాలు దుర్భాషలాడారు. హిజ్రాల తీరుతో వధువు కుటుంబ సభ్యులు నూజివీడు రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 


దీంతో పోలీసులు కళ్యాణ వేదికలు, షాపులు, టోల్ గేట్లు వద్ద డబ్బులు వసూలు చేసే హిజ్రాల గ్రూపులను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. శుభకార్యాల వద్ద ఎవరివకి తోచింది వారు ఇస్తే తీసుకుని దీవించి వెళ్ళాలి కానీ, అవమానకరంగా ప్రవర్తించి, బెదిరింపులకు పాల్పడి పరువు ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అంకబాబు  హిజ్రాలను హెచ్చరించారు. హిజ్రాల ఆగడాలు శృతి మించితే పోలీసుల సహాయం తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.


కర్నూలులో ఓ హిజ్రా ఆత్మహత్య


హిజ్రాలు కుటుంబాలకు దూరమై, సమాజంలో తీవ్రమైన వివక్షకు గురి అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కర్నూలు పట్టణంలోని త్రివర్ణ కాలనీలో నివాసం ఉంటున్న సాయిపల్లవి (సాయినాథ్‌రెడ్డి వయస్సు 21) అనే హిజ్రా ఆత్మహత్య చేసుకుంది. పట్టణ ఎస్‌ఐ శరత్‌కుమార్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అవుకు మండలం జూనూతల గ్రామానికి చెందిన సాయినాథ రెడ్డి నాలుగేళ్ల క్రితం హిజ్రాగా మారి డోన్‌ పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేది. కుటుంబం దూరం పెట్టడంతో.. ఇక తనను ఇంటికి రానివ్వరనే భయంతో, ఇంటికి వెళితే తనను నిరాకరిస్తారని మనస్తాపం చెందింది. గత సోమవారం తెల్లవారు జామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం గమనించిన తోటి హిజ్రాలు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. సాయినాథ్‌ రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.