Andhra Voter List :  ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ జాబితా ( Voter  list ) ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్,  సిటిజన్స్ ఫర్ డెమెుక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ అంశంపై కీలక ఆరోపణలు చేశారు.  రామ్ ఇన్ఫో ( Ram Info ) అనే ప్రైవేటు సంస్థ  ఐప్యాక్‌తో ఓటర్ల సమాచారం.. వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆరోపించారు.  బూత్‌ స్థాయిలో కీలకంగా వ్యవహరించే విపక్ష నేతలను కేసులతో బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 


టీడీపీ, లోకేష్‌తో ఏ పంచాయతీ లేదంటున్న కేటీఆర్ - సీమాంధ్ర మూలాలున్న ఓటర్ల అసంతృప్తిని గుర్తించారా ?


గుంటూరులో ( Guntur ) ఏర్పాటు చేసిన ఓటర్ల సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఐప్యాక్‌, రామ్‌ ఇన్ఫో వంటి సంస్థలు ఓటర్ల సమాచారం సేకరిస్తున్నాయిని.. రామ్‌ ఇన్ఫో సంస్థ గతంలో వాణిజ్య పన్నుల విభాగంలో సేవలు అందించిందన్నారు.  ఆ తర్వాత సంస్థ యాజమాన్యం చేతులు మారిందన్నారు.  నాటి నుంచి దాని పని తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయని నిమ్మగడ్డ గుర్తు  చేశారు. సామాజికంగా ప్రభావితం చేయగలిగే వారిని ఐప్యాక్, రామ్ ఇన్ఫో వంటి సంస్థలు గుర్తిస్తున్నాయని ఆ సమాచారం ఆధారంగా అధికార పార్టీ నాయకులు వాళ్లను సామ, దాన, భేద, దండోపాయాలతో లొంగదీసుకుంటున్నారని  ఆరోపించారు.                    


రాష్ట్రంలో ఇటీవల ఎఫ్ఐఆర్‌లు విపరీతంగా నమోదు అవుతున్నాయని అందుకు కారణం బెదిరింపులేనని ఆరోపించారు. ఎఫ్ఐఆర్‌లను బెదిరింపులకు అస్త్రంగా వినియోగిస్తున్నారని ఎఫ్‌ఐఆర్‌ల నమోదుపై ఓ కమిటీ వేయాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ డిమాండ్ చేశారు.  రిటైర్డ్ పోలీసు అధికారులతో ఎఫ్ఐఆర్‌ల నమోదుపై పరిశీలన చేయించే ఆలోచన ఉందని...కమిటీ విచారణలో తేలిన వాస్తవాలను హెచ్ఆర్‌సీ ముందు ఉంచుతాం అని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. పోలీసులు కొంతమందిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారన్న సమాచారం ఉందని  నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. అక్రమంగా కేసులు బనాయించే హక్కు పోలీసులకు లేదన్న ఆయన అలా చేస్తే ప్రజల హక్కులను హరించడమే అవుతుందన్నారు.          


వచ్చే ఎన్నికలను లైఫ్ అండ్ డెత్ గా తీసుకున్న జేసీ కుటుంబం - గెలిచేందుకు ఏం చేస్తున్నారంటే ?


  ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు నమోదు చేయించుకోవడానికి తనకే మూడేళ్లు పట్టిందని..స్థానికంగా నివాసం ఉండటం లేదనే కారణంతో ఓటు హక్కు కష్టమవుతోంది అని చెప్పుకొచ్చారు. తప్పుడు సమాచారం, దుర్బుద్ధితో ఫామ్‌ 7 దరఖాస్తు చేస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారని సిటిజన్స్ ఫర్ డెమెుక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు జోక్యం చేసుకుంటున్నారని.. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది.