వైసీపీకి దమ్ముంది కాబట్టి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసిందని, అలాంటి దమ్ము, ధైర్యం టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. టీడీపీ నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ అభ్యర్థికి ఓటు వేశారని, ఆవిషయం స్పష్టంగా తెలిసినా కూడా టీడీపీకి వారిపై చర్యలు తీసుకునే ధైర్యం లేదని చెప్పారు. 


10కోట్లకు బేరం..


తమ ఎమ్మెల్యేలు 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి 10కోట్ల రూపాయలకు డీల్ ఫిక్స్ అయిందని చెబుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు 10కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని చెప్పారు. చంద్రబాబుకి ఇలాంటి వవ్యవహారాలు అలవాటేనన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. గతంలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకోసం రేవంత్ రెడ్డితో బేరాలు నడిపారని, ఓటుకు నోటు స్కామ్ లో అరెస్ట్ చేస్తారనే భయంతో ఏపీకి పారిపోయి వచ్చారన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా అలాగే ఓట్లని నోట్లతో కొన్నారని చెప్పారు. 


చంద్రబాబుకి సిగ్గులేదు, బుద్ధి లేదు, అసలాయన మనిషే కాదు అంటూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది ఒక్కసీటేనని, తమకు ఆరు సీట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారాయన. కోవూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 52 సచివాలయాల పరిధిలో 57 వేల 379 గడపలు తిరిగానని చెప్పుకొచ్చారు. 


పట్టభద్రుల గెలిచిన ఎమ్మెల్సీ స్థానాలు మొత్తం నాలుగేనని గుర్తు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి, దానికే సంబరాలు చేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఆ గెలుపుతో జగన్ గజ గజ వణుకుతున్నారంటూ పచ్చ పత్రికల్లో రాయిస్తున్నారని, అలా ప్రచారం చేయించుకుని ఆనందపడుతున్నారని ఎద్దేవా చేశారు. 


జగన్ సింహం లాంటి వారని, సింహం కడుపున పుట్టిన సింహం అని చెప్పారు ప్రసన్న. చంద్రబాబు, తన దత్తపుత్రుడితో కలసి వచ్చినా, ఎన్ని జన్మలెత్తినా జగన్ ని ఏం చేయలేరనన్నారు. 30 సంవత్సరాల పాటు ఏపీకి జగన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. 


వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయగా అందులో ముగ్గురు నెల్లూరు జిల్లావారే కావడం విశేషం. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా ఉంది. నెల్లూరు నాయకులే జగన్ కి వెన్నుపోటు పొడిచారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే నెల్లూరు జిల్లా నాయకులు ఈ వ్యవహారంపై సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ముగ్గురు బయటకు వెళ్లిపోగా, మిగిలిన ఎమ్మెల్యేలు, తామంతా జగన్ తోన్ ఉన్నామని చెప్పుకోవడంలో భాగంగా చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. గతంలో కూడా చంద్రబాబు పేరు చెబితేనే తీవ్ర స్థాయిలో మండిపడే ప్రసన్న కుమార్ రెడ్డి, తాజాగా మరోసారి ఆయనపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కూడా ఒక గెలుపేనా అన్నారు. ఒక్కసీటు గెలిచి రెచ్చిపోతున్నారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు వైసీపీదేనని చెప్పారు.