ప్రకాశం జిల్లాలో రాజకీయే వేడెక్కింది. జిల్లా కేంద్రం ఒంగోలులో పట్టు నిలుపుకోడానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. బాలినేని కొడుకు ప్రణీత్ రెడ్డి స్థానికంగా జనాల్లో కలసిపోతున్నారు. అక్కడ శ్రీనివాసులరెడ్డి తరపున ప్రణీత్ రెడ్డి పార్టీ వ్యవహారాల్లో చురుగ్గ పాల్గొంటున్నారు. ప్రణీత్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు టీడీపీకి మింగుడు పడటంలేదు. టీడీపీ ఇప్పుడు ప్రణీత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టింది.


దామచర్ల వర్సెస్ బాలినేని..


2014 ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో బాలినేనిపై టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ గెలుపొందారు. 2019లో సీన్ రివర్స్ అయింది. దామచర్ల ఓడిపోగా, బాలినేని ఒంగోలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి అక్కడ ఆధిపత్య పోరు నడుస్తోంది. తాజాగా ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టిన దామచర్ల ఒంగోలులో విస్తృతంగా పర్యటిస్తున్నారు.




ప్రణీత్ రెడ్డిపై విమర్శలు..


బాలినేని ప్రణీత్ రెడ్డి పది రూపాయలు ఇచ్చి వైసీపీ కండువా కప్పి ఆ పార్టీలోకి వచ్చేస్తున్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు దామచర్ల జనార్దన్. అసలు టీడీపీ నుంచి ఎవరూ వైసీపీలోకి వెళ్లడం లేదని, కేవలం బెదిరించి కొంతమందిని ఆ పార్టీవైపు తిప్పుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల టైమ్ దగ్గరపడే సమయానికి వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ఉంటాయన్నారు దామచర్ల జనార్దన్. ఇటీవలే బాలినేని ప్రణీత్ రెడ్డి ముఖ్య అనుచరుడొకరు 300 మంది అభిమానులతో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఒంగోలులో టీడీపీ కూడా పట్టుకోసం ప్రయత్నిస్తోంది. బాలినేనికి మంత్రి పదవి తొలగించిన తర్వాత, టీడీపీ దూకుడు మరింత పెరిగింది.


ఒంగోలులో ఇదేం ఖర్మ..


రాష్ట్రవ్యాప్తంగా ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని టీడీపీ ప్రారంభించింది. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ముఖ్య నాయకులు ముందుకు తీసుకెళ్తున్నారు. ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలోని బలరాం కాలనీలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులెవరూ బ్యాంకు రుణం కట్టొద్దని సూచించారాయన. టీడీపీ అధికారంలోకి రాగానే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తామని భరోసా ఇచ్చారు.


వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులను మోసగించి వారి పేరు మీద రుణం తీసుకుని వడ్డీలు కట్టించుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు దామచర్ల జనార్దన్. ఆరు నెలల క్రితం నగదు చెల్లించినవారికి కూడా ఇళ్లు అప్పగించడంలేదన చెప్పారు. కనీసం టిడ్లో ఇళ్ల సముదాయాల్లో పనులు జరుగుతున్నా లబ్ధిదారులకు నమ్మకం కుదిరేదని, కానీ అక్కడ  పనులు కూడా జరగడంలేదన్నారు. గతంలో టిడ్కో ఇళ్లను ఎవరికైతే కేటాయించామో.. వారందరికీ వాటిని అప్పగిస్తామని హామీ ఇచ్చారు దామచర్ల జనార్దన్. ఇది దొంగ ప్రభుత్వమని, వైసీపీ నేతలు చెప్పే మాటలు నమ్మొద్దని సూచించారు. ఒంగోలు నగరంలో అభివృద్ధి పనులన్నీ టీడీపీ హయాంలో చేపట్టినవేనని చెప్పారాయన. ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలను నమోదు చేసుకున్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, ప్రకాశం జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు జనార్దన్.