నెల్లూరులో ఇటీవల నడిరోడ్డుపై జరిగిన ఓ హత్య సంచలనంగా మారింది. నగరంలోని ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ ముందు ఈ ఘటన జరగడం మరింత సంచలనంగా మారింది. అర్థరాత్రి జనసంచారం లేని సమయంలో భారీ వర్షంలో హంతకులు ఈ ప్లాన్ అమలు చేశారు. నడిరోడ్డుపై ఆటోని ఆపి, అందులోనుంచి గిరీష్ అనే వ్యక్తిని బయటకు లాగి రోడ్డుపై పడేశారు. చుట్టూ 13మంది గుమికూడారు. అందరూ ప్లాన్ అమలు చేశారు. ఒక్కసారిగా గిరీష్ పై దాడి చేశారు. కత్తులతో పొడిచారు. ఆ ప్రాంతమంతా తీవ్రంగా రక్తం పడిపోయింది. రక్తపు మడుగులో ఉన్న గిరీష్ చనిపోయాడనుకుని నిర్థారించుకున్న తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయారు.




నగరంలో రౌడీ షీటర్ దారుణ హత్య నెల్లూరులో కలకలం సృష్టించింది. అందులోనూ ఆ రౌడీషీటర్ కి ఓ రాజకీయ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని తేలడంతో అది రాజకీయ రంగు పులుముకుంది. కానీ అది పాత కక్షలే అని పోలీసులు తేల్చారు. గిరీష్ కి ఎవరెవరు శత్రువులున్నారనే కోణంలో విచారణ మొదలు పెట్టారు. చివరకు ఒకరి తర్వాత ఒకరు అలా 13మంది లెక్క తేలింది. ఆ 13మందిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కి తరలించారు.


మూడుసార్లు రెక్కీ..


గిరీష్ ని చంపేందుకు ఆ 13 మంది ముఠా రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. మూడోసారి వారు అనుకున్నట్టుగా పథకం అమలు చేశారు. గిరీష్ ని మట్టుబెట్టారు. ఆధిపత్య పోరు వల్లే ఈ హత్య జరిగిందని అంటున్నారు పోలీసులు. ఈ కేసులో 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు నగర ఇన్‌ ఛార్జి డీఎస్పీ అబ్దుల్‌ సుభాన్‌ తెలిపారు.


నిందితులెవరంటే..?


ఫతేఖాన్ పేటకు చెందిన దొడ్డవరం రంజిత్‌, గూడూరుకు చెందిన జోగి వినయ్‌, షేక్‌ కాలేషా, నిమ్మల శ్రీకాంత్‌, అలహరి ధనుష్‌, కనుపూరు శ్రీహరి, కీర్తిపాటి మహేష్‌, వెంకటాచలానికి చెందిన దాసరి నితీష్‌కుమార్‌, వేదాయపాలెంకు చెందిన జగదీష్‌, నెల్లూరు ఆచారి వీధికి చెందిన అజయ్‌ కుమార్‌, చిన్నబజారుకి చెందిన ఎం.కార్తీక్‌, బీవీ నగర్‌కు చెందిన తుమ్మగుంట రాజశేఖర్‌, పొదలకూరు రోడ్డుకు చెందిన బొమ్మాలి రమేష్‌ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


వీరందరితో గిరీష్ కి పాత కక్షలు ఉన్నట్టు గుర్తించారు. అంతే కాదు గతంలో వీరిని చంపేస్తానంటూ గిరీష్ బెదిరించేవాడని తెలుస్తోంది. తమని చంపేస్తాడనే భయంతో వారు ముందుగానే గిరీష్ ని మట్టుబెట్టినట్టు తెలుస్తోంది.


పక్కా ప్లాన్ ప్రకారం టీమ్ లుగా విడిపోయారు. రెక్కీ నిర్వహించారు. అక్టోబర్ 31వ తేదీ రాత్రి స్నేహితులతో కలిసి గిరీష్‌ ఆటోలో వస్తుండగా హత్య చేశారు. రమేష్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో దర్గామిట్ట ఇన్‌ స్పెక్టర్‌ సీతారామయ్య కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తుండగా చిల్లకూరు హైవే బూదనం టోల్‌ ప్లాజా వద్ద ఓ దాబాలో వారు దొరికారు. ఆ 13 మందిని అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 13 మందిలో ముగ్గురిపై రౌడీ షీట్లు ఉన్నాయని తెలుస్తోంది. మిగతా వారిపై కూడా రౌడీషీట్లు తెరుస్తామని చెప్పారు పోలీసులు.