నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ చార్జ్ గా కొత్త బాధ్యతలు తీసుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి, తానే 2024లో రూరల్ వైసీపీ అభ్యర్థిని అంటూ ధైర్యంగా ప్రకటించాలని కోరారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆదాల కానీ, ఆదాల కుటుంబ సభ్యులు కానీ రూరల్ ఎవరు పోటీ చేస్తారో స్పష్టం చేయాలన్నారు.


పారిపోయిన పెళ్లి కొడుకు..


పెళ్లి కుదిరింది, పీటల మీదకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు చేరుకున్నారు. పెళ్లి కొడుకు తాళి తీసుకున్నాడు. సడన్ గా ముహూర్తం సమయానిక పెళ్లి కొడుకు తాళితో సహా పారిపోయాడని, అలాంటి వ్యక్తి ఆదాల అని ఎద్దేవా చేశారు కోటంరెడ్డి. 2019 ఎన్నికల ముందు ఏం జరిగిందో మీకు తెలుసు కదా అని ప్రశ్నించారు. టీడీపీ ఇచ్చిన బి ఫామ్ జేబులో పెట్టుకుని నెల్లూరు రూరల్ లో ఆదాల టీడీపీ అభ్యర్థిగా ప్రచారానికి వచ్చారని, తనపై, జగన్‌పై విమర్శలు చేశారని.. ఆ తర్వాత ఆయన సెల్ ఫోన్‌కి మెసేజ్ వచ్చిందని, ప్రచారంలో ఉన్న ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు. చంద్రబాబుని కలుస్తానని చెప్పి వెళ్లిన ఆయన జగన్ ని కలసి వచ్చారని, నెల్లూరు ఎంపీగా టికెట్ తీసుకున్నారని వివరించారు. అలాంటి ఆదాల ఇప్పుడు కూడా చివరి నిమిషం వరకు వైసీపీలోనే ఉన్నట్టు నటించి ఆ తర్వాత వేరే పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని.. ఒకవేళ నిజంగానే అలా వెళ్లను అంటే ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలన్నారు. ఆదాల ఆ మాట చెబితే, తాను ఆయన పేరు సైతం ఎత్తనని అన్నారు కోటంరెడ్డి.


రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పు లేదని నిరూపించుకోవాలంటే, స్వయంగా వారే కేంద్ర హోం శాఖకు లేఖ రాయాలన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి ఉంటే అది సరైన పద్ధతి అవుతుందన్నారు కోటంరెడ్డి. కానీ కొండను తవ్వి ప్రభుత్వం ఎలుకను కూడా పట్టలేకపోయిందన్నారు. రాష్ట్రంలో చాలా మంది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర హోం శాఖను రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే మిగతా వ్యవహారాలన్నీ బయటపడతాయని భయపడుతోందన్నారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, తన అభ్యర్థన మేరకు కేంద్రానికి లేఖ రాయాలన్నారు.


తన స్నేహితుడు ఫోన్ రికార్డింగ్ పై ప్రెస్ మీట్ పెట్టడంపై కోటంరెడ్డి స్పందించారు. తన స్నేహితుడికి సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ సరిగా రాసివ్వలేదన్నారు. తన ఫోన్లో 5 నెలలుగా రికార్డులు ఉంటాయని చెప్పిన తన స్నేహితుడు.. కేవలం తనతో జరిగిన సంభాషణను ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ట్యాపింగ్ వ్యవహారంలో ఓ క్లారిటీ వచ్చిందన్నారు. సజ్జల స్క్రిప్ట్ ప్రభుత్వానికి మేలు చేయకపోగా, తనకు మేలు చేసిందన్నారు కోటంరెడ్డి. వైసీపీలో ఉన్నప్పుడు తనకు ఏమీ చేయలేకపోయాన్న బాధతో సజ్జల ఇలా తనకు మేలు చేశాడన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కేంద్రానికి లేఖ రాయాలన్నారు.


ఇదీ నా బలం..


ఈరోజు ప్రెస్ మీట్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన మద్దతుదారులందరితో మాట్లాడించారు. ఆయనకు మద్దతుగా వచ్చిన కార్పొరేటర్లు, తామంతా కోటంరెడ్డి వెంటే ఉంటామని చెప్పారు. తమకు జగన్, చంద్రబాబు ఎవరూ తెలియదని తమకు తెలిసిందల్లా కోటంరెడ్డే అని అన్నారు. తమ పార్టీ శ్రీధర్ రెడ్డి పార్టీ అని అన్నారు.