గాడిద పాలపై వేమన శతకంలో ఉన్న పద్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే గాడిదపాలను ఈరోజుల్లో మరీ అంత తేలిగ్గా తీసీపారేయక్కర్లేదు. ఎందుకంటే గాడిద పాలు కొనాలన్నా దొరకవు. ఆ మాటకొస్తే ఆవు పాలకంటే గాడిదపాలే ఇప్పుడు అరుదైనవి, ఆరోగ్యకరమైనవి అని కూడా ప్రచారం ఉంది. గాడి పాల అమ్మకం కోసం చాలామంది బృందాలుగా ఏర్పడి సంచార జీవనం గడుపుతుంటారు. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలనుంచి అలాంటి ఓ బృందం నెల్లూరు జిల్లాకు వచ్చింది. దాదాపు 15 గాడిదలు, వాటికి ఉన్న 15 పిల్లలను తీసుకుని వీరంతా నెల్లూరు జిల్లాలో గాడిదపాలను అమ్ముతున్నారు.


ఉగ్గిన్నెడు గాడిద పాలు 100 రూపాయలు, ఆ లెక్కన లీటరు పాలు 10వేల రూపాయలుంటాయని చెబుతున్నారు అమ్మకందారులు. గాడిదలు పావు లీటర్ పాలు మాత్రమే ఇస్తాయి. వీటిని తాగడం వల్ల ఉబ్బసం, ఆయాసం తగ్గిపోతాయని, గురక వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు.


తెలంగాణ నుంచి గాడిదలను తీసుకొచ్చి ఇక్కడ పాలు అమ్ముకుంటూ చాలామంది జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లోనే వీరికి వ్యాపారం బాగా జరుగుతుంది. మరికొన్ని చోట్ల ఎవరూ గాడిద పాల జోలికి వెళ్లరు. అలాంటి చోట్ల వీరు ఎక్కువరోజులు ఉండరు. పెట్టేబేడా సర్దేసుకుని మకాం మార్చేస్తారు. ఎక్కువరోజులు కూడా ఒకే ప్రాంతంలో ఉండరు. సంచార జీవనం సాగిస్తూ ప్రతి ఊరిలో ఆగుతూ గాడిదపాలు అమ్ముకుంటుంటారు. మూడు నాలుగు కుటుంబాలకు చెందినవారు ఒకసారే ప్రయాణం ప్రారంభిస్తారు. ఎక్కడికక్కడ లారీలలో గాడిదలను చేరవేస్తూ వ్యాపారం చేస్తుంటారు. ఏడాదిపాటు గాడిదల సంతతిని పెంచి, ఆ తర్వతా వాటిని అమ్మేస్తుంటారు.




గతంలో మగ గాడిదలకు ఎక్కువగా డిమాండ్ ఉండేది. గాడిదలపై బరువులను ఒకచోటనుంచి మరొకచోటకు చేర్చేవారు. అయితే ఇప్పుడు ఆడ గాడిదలకే డిమాండ్ ఎక్కువ. వాటి పాలతో వ్యాపారం చేస్తున్నారు. గాడిద పాలను వివిధ రకాల ఉప ఉత్పత్తులకోసం కూడా వినియోగిస్తున్నారు.


గాడిద పాల ఉత్పత్తికోసం ప్రత్యేకంగా డైరీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. డైరీల్లో పెంచిన గాడిదలనుంచి పాలను సేకరించి అమ్ముతుంటారు. వాటితో చర్మ సౌందర్య ఉత్పత్తులు కూడా తయారు చేస్తుంటారు. ఊరూరా తిరిగి గాడిద పాలు అమ్ముతూ వాటి సంతతిని వృద్ధి చేస్తున్నవారు, ఆ తర్వాత డైరీలకు అమ్మేస్తుంటారు. మగ గాడిదలను బరువులు మోయడానికి వినియోగిస్తారని, ఆడ గాడిదలను పాలకోసం పెంచుతుంటారని చెబుతున్నారు.


ఇక డాక్టర్లు మాత్రం గాడిద పాలతో ప్రయోజనం శూన్యం అని చెబుతున్నారు. చిన్న పిల్లలకు తల్లి పాలే శ్రేష్టమైనవని, గాడిద పాలు తాగడం వల్ల అదనపు ఉపయోగాలు ఉండవని అంటున్నారు. ఉగ్గిన్నుడు పాలకోసం 100 రూపాయలు ఖర్చు చేయడం అనవసరం అంటున్నారు. గాడిద పాలలో ప్రత్యేక పోషకాలేవీ ఉండవంటున్నారు.




గాడిద పాలు పల్చగా ఉంటాయని, కాబట్టి త్వరగా జీర్ణమవుతాయని, అంతకు మించి వాటి వల్ల ఉపయోగమేమీ లేవంటున్నారు డాక్టర్లు. ప్రత్యేక పోషక విలువలు కలిగి ఉన్న పాలు అంటూ వాటిని అమ్మడం సరికాదని చెబుతున్నారు. గాడిద పాలతో వ్యాపారం చేస్తుంటారని, దాన్ని ప్రజలు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.