నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సీఎం జగన్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అర్జంట్ గా తాడేపల్లి వచ్చి జగన్ ని కలవాలనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. సరే మీరు చెప్పినట్టుగానే వస్తానని సమాధానం చెప్పి ఫోన్ పెట్టేశారు శ్రీధర్ రెడ్డి. అంత అర్జంట్ గా ఓ ఎమ్మెల్యేకి సీఎం నుంచి ఫోన్ ఎందుకొచ్చింది. పోనీ మంత్రి వర్గ విస్తరణా అంటే అదీ లేదు. లేదా 2024కి టికెట్లు కన్ఫామ్ చేస్తున్నారా అంటే అదీ లేదు. నామినేటెడ్ పోస్ట్ లు కూడా దగ్గర్లో లేవు. మరి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి సీఎం ఆఫీస్ నుంచి ఎందుకు ఫోన్ వచ్చింది. అసలేం జరుగుతోంది..?


కూల్ చేస్తారా..?


సీఎం జగన్ పిలుపు మేరకు ఇవాళ(సోమవారం) శ్రీధర్ రెడ్డి తాడేపల్లి వెళ్తున్నారు. భేటీ సారాంశం ఏంటనేది తేలాల్సి ఉంది. ఇటీవల రెండు సందర్భాల్లో వైసీపీని ఇరుకున పెట్టేలా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నెల్లూరు జిల్లా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి అధికారులపై ఫైర్ అయ్యారు. రోడ్లు వేసేందుకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒక సందర్భంలో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ ను కలిస్తే ఆయన తనను అవమానించేలా వ్యవహరించారని కూడా అన్నారు శ్రీధర్ రెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తాను వెళ్తే కనీసం కూర్చోండి అని కూడా ఆయన అనలేదని బహిరంగ వేదికపైనే చెప్పారు. తానే కుర్చీ లాక్కొని ఎదురుగా కూర్చున్నా సరే కనీసం తనవైపు తలెత్తి చూడలేదని, ఆ తర్వాత సమస్యను వివరిస్తే ఊ అని ఊరుకున్నారని అన్నారు.


అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధుల‌ మంజూరుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు వేస్తున్నారని ఆరోపించారు శ్రీధర్ రెడ్డి. తాను అందరు ఎమ్మెల్యేల్లాగా ఉండబోనని, తాడోపేడో తేల్చుకుంటానన్నారు. ప్రజలకోసం ఎంతదూరం అయినా వెళ్తానని, అన్నిటినీ మౌనంగా భరించే వ్యక్తిని మాత్రం తాను కాను అని చెప్పారు. నెల్లూరు రూరల్ లో రోడ్ల నిర్మాణంతో జనం ఇదేం ఖర్మ అనుకుంటున్నారని కూడా అన్నారు శ్రీధర్ రెడ్డి.


పింఛన్ల కోసం రచ్చ..


ఇటీవల ఏపీలో కొంతమందికి పింఛన్ల రద్దు వ్యవహారం చర్చనీయాంశమైంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2700 మందికి పింఛన్లను తొలగించేందుకు అధికారులు నోటీసులిచ్చారు. వారిలో చాలామంది ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని కలసి మొరపెట్టుకున్నారు. వారికి భరోసా ఇచ్చి పంపించేసిన ఆయన, అధికారుల తీరుపై మండిపడ్డారు. ఒకేసారి ఇలా నోటీసులిస్తే ఎలాగన్నారు. అందరికీ పింఛన్లు ఇవ్వాల్సిందేనన్నారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ కూడా బాగా ఉపయోగించుకుంది. ఆ తర్వాత సీఎం జగన్ పింఛన్లపై రాద్ధాంతం చేయొద్దని, అనర్హులకు పింఛన్లు తీసివేయడం తప్పుకాదని, ప్రతి ఆరు నెలలకోసారి సోషల్ ఆడిట్ జరుగుతుందని చెప్పారు. కొంతమంది పింఛన్లు తొలగిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిని కలెక్టర్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ గట్టిగా తిట్టాలన్నారు.


ఇలా ఈ రెండు కారణాలతో పార్టీని తనకు తెలియకుండానే ఇబ్బంది పెట్టారు శ్రీధర్ రెడ్డి. అయితే ఇప్పుడు జగన్ పిలిపించిన కారణం ఏంటో తేలాల్సి ఉంది. ప్రభుత్వాన్ని, పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడిన శ్రీధర్ రెడ్డికి క్లాస్ తీసుకుంటారా, లేక ఆయన్ను బుజ్జగించి పంపిస్తారా అనేది తేలాలి.