Nellore News : నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం బట్లదిన్నె గ్రామంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బట్లదిన్నె గ్రామంలో పర్యటించారు. ఎమ్మెల్యే రామిరెడ్డిని గ్రామస్తులు రోడ్డు కోసం నిలదీశారు. రోడ్డుకు శంఖుస్థాపన చేసి ఇంత వరకు రోడ్డు వేయలేదని ప్రశ్నించారు.  రోడ్డు వేసిన తర్వతే గ్రామంలో అడగుపెట్టండని పెద్ద ఎత్తున గ్రామస్తులు ఎమ్మెల్యేని అడ్డుకోవటంతో ఎమ్మెల్యే రామిరెడ్డి ఆవేశం తట్టుకోలేక గ్రామస్తులపై నోరుపారేసుకున్నారు. చివరకు రామిరెడ్డి మహిళల వద్దకు వెళ్లి తన నమ్మకం ఉంచాలని కోరారు.  రోడ్డు వేస్తేనే ఎన్నికల్లో ఓటు అడగటానికి బట్లదిన్నెకు వస్తానన్నారు.  వేయలేకపోతే రానంటూ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ శపథం చేసి వెనుతిరిగారు. అయితే మహిళను నోరు మూసుకో అంటూ రామిరెడ్డి ప్రతాప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 


నోరు జారిన ఎమ్మెల్యే 


'సార్‌, మా ఊరి రోడ్డు అధ్వానంగా ఉంది. కొత్త రోడ్డు వేస్తామని చెప్పి ఏడాదైదనా ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదు.' అని ఓ యువకుడు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆగ్రహంతో 'మూసుకో, పగిలిపోద్ది. నువ్వు టీడీపీ వాడివి. ఆ పార్టీ వాళ్లు రెచ్చగొడుతుంటే మేం సహించం.' అని నోరుజారారు. మరో మహిళ కూడా ఎమ్మెల్యే రామిరెడ్డిని ప్రశ్నించారు. తమ ఇంటి వద్దకు వస్తే  సమస్యలు తెలుస్తాయని నిలదీసింది. మీ ఇంటికే వచ్చా నువ్వు నిద్రపోతున్నావ్ అని ఎమ్మెల్యే అన్నారు. మరో మహిళ నీళ్లు నిలిచి ఇంట్లోకి పాములు వస్తున్నాయంటే ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ తన ఇంటి ఆవరణలోకి కూడా పాములు వస్తున్నాయని సమాధానం ఇచ్చారు.  


రోడ్డు వేశాకే ఓట్లు అడిగేందుకు వస్తా 


గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజా సమస్యలపై కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి ఈ విధంగా స్పందించారు. ఆదివారం కావలి మండలం బట్లదిన్నెకు ఎమ్మెల్యే రామిరెడ్డి వస్తున్నారన్న సమాచారంతో గ్రామస్తులు సెంటర్ వద్ద గుమికూడారు. హైవే నుంచి బట్లదిన్నెకు వచ్చే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడాది అయినా పనులు చేయలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరికి స్కూల్ బస్సులు రావడం లేదన్నారు. మార్గమధ్యలో చెరువు అలుగు ప్రమాదకరంగా మారిందని చెప్పారు. సమస్యలు చెబుతున్న యువకుడిపై ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్లు రెచ్చగొడితే నమ్మొద్దని గ్రామస్తులను కోరారు. ఏళ్లకు ఏళ్ల పాలించిన టీడీపీ రోడ్డు వేయలేదని, తమ పార్టీ అధికారంలో వచ్చి మూడేళ్లు అయిందన్నారు. ఊరికి రోడ్డు వేశాకే మళ్లీ ఊరు వస్తానని ఎమ్మెల్యే అన్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు రానన్నారు. ఇందిరమ్మకాలనీ వాసుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన వాళ్ల ఇంటికి వెళ్లారు. మహిళల వినతులపై ఎమ్మెల్యే స్పందించిన తీరుతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.