Narasapuram MP Bhupatiraju Srinivasa Varma: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న వేళ ఆయన మంత్రివర్గంలో చోటు దక్కించుకోబోతున్న ఎంపీలు ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీ నుంచి టీడీపీలో 16 మంది ఎంపీలు ఉండగా.. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కు స్థానం ఖరారైనట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరికి మంత్రి పదవులు వచ్చాయని.. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.


తాజాగా రాష్ట్రం నుంచి మరో ఎంపీకి కూడా మోదీ కేబినెట్‌లో స్థానం దక్కుతుందని తెలుస్తోంది. ఏపీ నుంచి కేంద్ర క్యాబినెట్ లోకి నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు చోటు దక్కిందని సమాచారం. జూన్ 9న ఉదయం ప్రధాని నివాసంలో తేనీటి విందుకి శ్రీనివాస్ వర్మ హాజరైయ్యారు. ఢిల్లీలో నేడు (జూన్ 9) రాత్రి జరగబోయే మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరందరినీ మోదీ తేనీటి విందుకు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే శ్రీనివాస వర్మ కూడా ఆ విందుకు హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఈయనకు కూడా మోదీ మంత్రివర్గంలో స్థానం దక్కిందని స్పష్టం అవుతోంది.