Nara Lokesh makes surprise visit to identify issues in mid-day meal scheme: ఏపీ మంత్రి నారా లోకేష్ మైలవరంలోని స్కూల్ ని ఆక్మసికంగా తనికీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం నాణ్యతపై తలెత్తిన వివాదం కారణంగా, ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా మంత్రి నేరుగా పాఠశాలకు వెళ్లారు. ఈ పర్యటన అధికారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
పాఠశాలకు చేరుకున్న వెంటనే మంత్రి లోకేష్ ఏమాత్రం సంకోచించకుండా విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని, వారికి వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. కొత్త కాంట్రాక్టర్ అందిస్తున్న ఆహారం ఎలా ఉంది? గతంలో ఎదురైన ఇబ్బందులేంటి? అని విద్యార్థులను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, విద్యార్థులకు ఒక కీలక సూచన చేశారు భోజనం బాగాలేకపోతే భయపడకండి, వెంటనే తల్లిదండ్రులకు చెప్పండి అంటూ వారిలో ధైర్యాన్ని నింపారు.
ఈ సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులకు మంత్రి గట్టి వార్నింగ్ ఇచ్చారు. మీపై పవిత్రమైన బాధ్యత ఉంది, చిన్న తప్పు జరిగినా సహించే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. తప్పు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భోజనం నాణ్యతను కేవలం ఫిజికల్గా తనిఖీ చేయడమే కాకుండా, లీప్ యాప్, ఐవీఆర్ఎస్ (IVRS) ద్వారా ప్రతివారం తల్లిదండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పుల కోసం మంత్రి లోకేష్ ఒక భారీ రోడ్ మ్యాప్ను సిద్ధం చేశారు. ఇకపై వారానికి ఒకరోజు ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలోని ఏదో ఒక పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని నిబంధన విధించారు. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన ఆహారం అందించడం కోసం సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించిన మంత్రి, అక్కడ అందుతున్న పౌష్టికాహారం , పరిశుభ్రతను పర్యవేక్షించారు. కేవలం భోజనం మాత్రమే కాకుండా, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచడంపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. లోకేష్ చేపట్టిన ఈ ఆకస్మిక తనిఖీ, క్షేత్రస్థాయిలో మార్పు కోరుకునే సామాన్య తల్లిదండ్రుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
