Nara Lokesh making his mark Education Department:  రాజకీయాల్లో ఏ చిన్న పని చేసినా భారీ హోర్డింగ్‌లు, పత్రికల్లో సొంత డబ్బా కొట్టుకునే ఫోటోలతో ప్రచారం చేసుకోవడం చూస్తుంటాం. కానీ, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో ఒక సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. తన ఫోటోలు ప్రదర్శించుకోవడం కంటే, ప్రభుత్వ విద్యా వ్యవస్థ సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు.  పదో తరగతి ఫలితాల సందర్భంగా పత్రికల్లో ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనల్లో మంత్రి ఫోటో ఎక్కడా కనిపించలేదు.  కేవలం మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలు, వారి ప్రతిభను మాత్రమే హైలైట్ చేయడం ద్వారా  క్రెడిట్  అంతా విద్యార్థులకు, ఉపాధ్యాయులకే ఇస్తున్నారనే సంకేతాలను ఆయన బలంగా పంపారు.

Continues below advertisement

విద్యాశాఖలో పలు సంస్కరణలు

నారా లోకేష్ విధానంలో  వ్యక్తి కంటే వ్యవస్థ ముఖ్యం  అనే సూత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పదో తరగతి ఫలితాల విడుదల సమయంలోనూ ఎటువంటి ఆర్భాటం లేకుండా, కేవలం విద్యాశాఖ పురోగతిని వివరించేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో కంటే మెరుగైన ఫలితాలు రావడానికి కారణమైన 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ  , స్లిప్ టెస్టులు, లీప్ మొబైల్ యాప్ వంటి సాంకేతిక సంస్కరణలపై ఆయన దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరగడం తన వ్యక్తిగత విజయం కంటే, విద్యాశాఖలో వస్తున్న మార్పుగా ఆయన చిత్రీకరిస్తున్నారు. 

Continues below advertisement

నిడమర్రు పాఠశాల ఓ మోడల్ 

నిడమర్రు లో నిర్మించిన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మోడల్ స్కూల్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు  15 కోట్ల వ్యయంతో, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అత్యాధునిక ల్యాబ్‌లు, డిజిటల్ తరగతులు,  క్రీడా ప్రాంగణాలతో ఈ పాఠశాలను తీర్చిదిద్దారు. కేవలం ఒక స్కూల్ కట్టి వదిలేయకుండా, ఇటువంటి అంతర్జాతీయ స్థాయి విద్యా సౌకర్యాలను ప్రతి నియోజకవర్గంలోనూ అందుబాటులోకి తేవాలన్నది ఆయన లక్ష్యం. ఈ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనే లోకేష్ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఉపాధ్యాయుల సమస్యలు లేకుండా నియామకాలు

ఉపాధ్యాయుల నియామకాలు లేదా బదిలీల వంటి సున్నితమైన అంశాల్లో కూడా వివాదాలకు తావులేకుండా పారదర్శకమైన విధానాలను అమలు చేస్తున్నారు. గత పాలకుల విధానాల వల్ల దెబ్బతిన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను పునర్నిర్మించే క్రమంలో.. ఉపాధ్యాయులలో జవాబుదారీతనాన్ని పెంచుతూనే, వారికి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నారు. సంస్కరణలు అనేవి కేవలం కాగితాల మీద కాకుండా, తరగతి గదిలో మార్పు తెచ్చేలా ఉండాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.

విద్యాశాఖలో నో ఫోటో, నో పాలిటిక్స్ పాలసీ

లోకేష్ అనుసరిస్తున్న ఈ 'నో-ఫోటో' ప్రచార వ్యూహం విద్యావంతుల్లో మరియు సోషల్ మీడియాలో విశేష స్పందన పొందుతోంది. తన గురించి తాను చెప్పుకోవడం కంటే, తన పనిని ప్రజలే గుర్తించేలా చేయడం ద్వారా ఆయన రాజకీయంగా మరింత పరిణతిని చాటుకుంటున్నారు. ప్రచార ఆర్భాటం లేని ఈ పనితీరు, అంతిమంగా ప్రభుత్వ బడులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతోంది.  ప్రతిభకు గుర్తింపు - వ్యవస్థకు గౌరవం  అనే నినాదంతో లోకేష్ సాగిస్తున్న ఈ ప్రయాణం ఏపీ విద్యా రంగంలో ఒక మైలురాయిగా ఉంటుందన్న అంచనాలు ప్రజల నుంచి వస్తున్నాయి.