Nara Lokesh Inaugurates SAEL Solar Project: నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రస్థానంలో మరో కీలక మైలురాయి నమోదైంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లోనే సిద్ధమైన సుఖ్బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ సోలార్ ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.
రూ. 3,000 కోట్ల భారీ పెట్టుబడితో, 2,400 ఎకరాల్లో విస్తరించిన ఈ 600 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం, రాష్ట్ర అభివృద్ధి వేగానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బ్రాండ్ సీబీఎన్ పట్ల ఉన్న నమ్మకం వల్లే గ్లోబల్ ఇన్వెస్టర్లు ఏపీకి క్యూ కడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పాలనను, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనను పోల్చుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మా బ్రాండ్ జాబ్ క్రియేషన్.. మీ బ్రాండ్ గొడ్డలి అంటూ పరోక్షంగా ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. ఇచ్చిన మాటను చేతల్లో చూపే నాయకత్వం ఉండబట్టే, పంజాబ్కు చెందిన కంపెనీ ఏపీకి వచ్చి ఇంతటి భారీ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసిందని కొనియాడారు.
ఈ ప్రాజెక్టు వల్ల స్థానిక రైతులకు, యువతకు భారీగా లబ్ధి చేకూరింది. నిర్మాణ సమయంలోనే సుమారు 1,000 మందికి ఉపాధి లభించగా, అందులో 80 శాతం మంది స్థానికులే కావడం విశేషం.
అంతేకాకుండా, దీర్ఘకాలిక లీజు ఒప్పందాల ద్వారా 760 మంది రైతు కుటుంబాలకు స్థిరమైన ఆదాయం సమకూరింది. భవిష్యత్తులో వ్యవసాయ వ్యర్థాల నుండి మరో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా SAEL సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం దక్కుతుందని లోకేష్ వివరించారు.
పర్యావరణ పరిరక్షణలోనూ ఈ సోలార్ పార్క్ కీలక పాత్ర పోషించనుంది. ఏటా సుమారు 11 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను ఈ ప్రాజెక్ట్ ద్వారా నివారించవచ్చని అంచనా.
ఇక్కడ ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన విద్యుత్, జాతీయ గ్రిడ్లోకి సరఫరా అయి గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాల అవసరాలను కూడా తీర్చనుంది. ఏపీని గ్రీన్ ఎనర్జీ క్యాపిటల్ గా మార్చడమే లక్ష్యంగా 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని, అందులో భాగంగానే జమ్మలమడుగులో అదానీ, జెన్కో వంటి సంస్థల ప్రాజెక్టులు కూడా త్వరలో పట్టాలెక్కబోతున్నాయని మంత్రి వెల్లడించారు.
విదేశీ , స్వదేశీ పెట్టుబడిదారులకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు.
