Nagam Janardhan Reddy met Chandrababu: తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి ఎపి సిఎం చంద్రబాబు నాయుడును అసెంబ్లీలో కలిశారు. చాలా కాలం తరువాత తనను కలిసిన నాగంను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. నాగం గారూ...ఎలా ఉన్నారు....ఆరోగ్యం ఎలా ఉంది...చాలా రోజులు అయ్యింది కలిసి అంటూ పలకరించారు. పిల్లలు ఏం చేస్తున్నారు అని ఆరా తీశారు. నాగం కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్న చంద్రబాబు...ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయనకు సూచించారు. నాగం వయసు, బరువు కారణంగా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకే చంద్రబాబు ఆరోగ్య పరంగా ఎక్కువ బాధ్యతలు చెప్పారు.
పాత కేసుల విచారణ సందర్భంగా కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన నాగం
ఓబులాపురం మైనింగ్ అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై నాడు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం జనార్థన్ రెడ్డి గురువారం హాజరయ్యారు. తుది తీర్పు ప్రకటన సందర్భంగా నాగం విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబును కలిశారు. ఆనాటి కేసులను ఎట్టకేలకు కొట్టివేయడంపై చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు.
కేసులు కొట్టి వేస్తూ కోర్టు తీర్పు - తర్వాత చంద్రబాబును కలిసేందుకు అసెంబ్లీకి వచ్చిన నాగం
భేటీ సందర్భంగా ఇరువురు నేతలు పలు పాత ఘటనలను గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు చేసిన ప్రజా పోరాటాలను గురించి చర్చించుకున్నారు. నాగం ఫైర్ బ్రాండ్గా ఉండేవారని....పార్టీ ఆదేశిస్తే దూసుకుపోయేవాళ్లని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఎంతో ఎమోషనల్గా ఉండేవారంటూ నాటి ఘటనలను ప్రస్తావించారు. నాలుగవ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నాగం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి...తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలనేదే తన అభిమతమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు.
పాత విషయాలను గుర్తు చేసుకున్న ఇరువురు నేతలు - ఆరోగ్యంపై జాగ్రత్త చెప్పిన చంద్రబాబు
ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో నాగం జనార్ధన్ రెడ్డి నెంబర్ 2 నాయకుడుగా ఉండేవారు. ప్రభుత్వం ఏర్పడితే మంత్రిగా ఉండేవారు. లేకపోతే ప్రతిపక్షంలో కీలక నేతగా ప్రభుత్వంపై పోరాడేవారు. అయితే ఇలాంటి నేతలందరికీ తెలంగాణ ఉద్యమం కారణంగా రాజకీయ భవిష్యత్ తలకిందులు అయింది. టీడీపీపై ఆంధ్రా పార్టీ అనే ముద్ర పడటంతో సీనియర్ నేతలు రాజకీయ భవిష్యత్ కోసం వేరే పార్టీలను చూసుకోక తప్పలేదు. నాగం సొంత పార్టీ పెట్టుకున్నారు.. బీజేపీలో చేరారు..కాంగ్రెస్ లో చేరారు.. అయినా మరోసారి ఆయన నాగర్ కర్నూలు నుంచి గెలవలేకపోయారు. దాంతో రాజకీయంగా ఆయన సైలెంట్ అయిపోయారు. ఆయన ఆరోగ్యం కూడా ఇప్పుడు సహకరించకపోవడంతో ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించడం లేదు.