Nude Video Case :  హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తనపై కుట్ర చేశారని సీఐడీకి ఫిర్యాదు చేశారు. తన ఫేక్ వీడియోను క్రియేట్ చేసి పరువు తీశారని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు . ఎంపీ ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే వీడియో వివాదం సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో చాలా ఆలస్యంగా గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేయడం..  వెంటనే సీఐడీ కేసు నమోదు చేయడం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. కేసు నమోదు కాక ముందే ఏపీసీఐడీ ఈ అంశంపై టీడీపీ నేతలు విడుదల చేసిన అమెరికా సంస్థ ఫోరెన్సిక్ రిపోర్టుపై విచారణ జరిపింది. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఫేక్ అని ప్రకటించారు. కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కేసులు నమోదు చేశారో లేదో స్పష్టత లేదు. 


ఆగస్టు మొదటి వారంలో కలకలం రేపిన న్యూడ్ వీడియో 


ఆగస్టు మొదటి వారంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అది తనది కాదని గోరంట్ల మాధవ్ ప్రకటించారు. తాను జిమ్ చేస్తున్న వీడియోను తీసుకుని మార్ఫింగ్ చేశారని వాదించారు. తాను అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశానని  ప్రకటించారు. అయితే అనంతపురం పోలీసులు తమకు ఎలాంటి  ఫిర్యాదు  చేయలేదని.. ఆయన అభిమానులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపామన్నారు.   అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వర్జినల్ కాదని. ఓ ఫోన్‌లో ప్లే అవుతూండగా.. వీడియో తీశారని అసలు వీడియో దొరకలేదన్నారు. 


అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ 


ఆ తర్వాత టీడీపీ నేతలు అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపో్రటును బయట పెట్టారు. అది ఖచ్చితమేనన్నారు. వీరికి పోటీగా సీఐడీ కూడా అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు లేఖ రాసి అందులో మార్పులు జరిగాయని చెప్పింది. ఆ తర్వాత గోరంట్ల మాధవ్  ఒరిజినల్‌ వీడియో తన ఫోన్‌లో ఉందని విచారణ చేస్తే పోలీసులకు ఇస్తానని ప్రకటించారు.  తనపై టీడీపీ నేతలు కుట్రపూరితంగా ఫేక్‌ వీడియోలు క్రియేట్‌ చేశారన్నారు. ఐటీడీపీ సోషల్‌మీడియా ద్వారా యూకే నుంచి ఫేక్‌ వీడియోలను పంపారని రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని మాధవ్ అప్పట్లో ప్రకటించారు. 


నెల రోజుల తర్వాత ఫిర్యాదు చేసిన గోరంట్ల మాధవ్


ఇటీవల ఈ వివాదం సద్దుమణిగినట్లుగా అయింది. గోరంట్ల మాధవ్ వేధించారని ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అది నైతిక పరమైన అంశమేనని అందులో వివాదమేదీ లేదని భావించారు. అయితే అనూహ్యంగా దాదాపుగా నెల రోజుల తర్వాత తన వీడియోను మార్ఫింగ్ చేశారని సీఐడీకి ఫిర్యాదు చేయడం.. కేసు కూడా నమోదు కావడంతో ఈ వివాదం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీపై గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో సీఐడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.