Avinash Letter To CBI:  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో సారి సీబీఐ విచారణకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు ఓ ప్రత్యేకమైన లేఖ అందించినట్లుగా తెలుస్తోంది. వివేకా హత్య కేసులో తనకు తెలిసిన సమాచారంతో పాటు తనకు ఉన్న సందేహాలను అందులో పేర్కొన్నానని అవినాష్ రెడ్డి చెబుతున్నారు. హత్య కేసులో తనకు తెలిసిన సమాచారం ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాను చెప్పాలనుకున్నది సీబీఐకి చెప్పవచ్చు కదా.. ప్రత్యేకంగా లేఖ ఇవ్వడం ఎందుకన్నది కూడా ఆసక్తి రేుపతోంది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి సీబీఐ తీరుపై చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌తో పాటు సీబీఐ డైరక్టర్‌కూ లేఖ రాశానని అవినాష్ రెడ్డి మీడియాకు చెప్పారు. 


తనకున్న సందేహాలపై లేఖ ఇచ్చానన్న  అవినాష్ రెడ్డి !


సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని.. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని కోరాను , కానీ రికార్డ్ చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసు రోజు మీడియా తో మొట్ట మొదట గా మాట్లాడింది తానేనన్నారు.  ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ కు కట్టుబడి ఉన్నానని.. ఇప్పుడు కేసు విచారణ వ్యక్తి టార్గెట్ గా నడుస్తుందన్నారు. మొదటి సారి విచారణ కు వచ్చినప్పుడు మరో సారి రావాలని చెప్పారు  కానీ ఇప్పుడు విచారణ ముగిసిన తరువాత  మరోసారి విచారణకు రావాలని ఏమి చెప్పలేదని  అవినాష్ రెడ్డి మీడియాకుచెప్పారు.  వివేకా హత్య కు సంబంధించి నా దగ్గర ఉన్న సమాచారాన్ని ఇచ్చాను ...మీడియాలో వస్తున్న కథనాలతో సీబీఐ విచారణ పై ప్రభావం పడుతోందన్నారు.  


విచారణ ఏకపక్షంగా జరుగుతోందన్న అవినాష్ రెడ్డి 


తనకు  160సీఆర్పీసి కింద ఇచ్చిన నోటీస్ ఇచ్చారని.. తనను సాక్షిగా విచారిస్తున్నారో, నేరస్తుడిగా విచారిస్తున్నారా  తెలీదని చెప్పుకొచ్చారు.  టిడిపి సంవత్సరం కింద చెప్పిన అంశంలనే సి బి ఐ కౌంటర్ లో చెప్పిందన్నారు.  వివేక మర్డర్ జరిగిన రోజు దొరికిన లెటర్ ఎందుకు దాస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆ లేఖ ను బయటికి తీసుకురావాలని కోరుతున్నానని మీడియాకు చెప్పారు. తన విచారణలో ఎక్కడ ఆడియో వీడియో రికార్డింగ్ లేదని.. న్యాయవాదులను అనుమతించాలని కోరాను అందుకు సిబిఐ ఒప్పుకోలేదని ఆయన చెబుతున్నారు. సీబీఐ అధికారులు చెబుతున్న గూగుల్ టెక్ ఔట్ .. టీడీపీ టెక్ ఔట్ అయి ఉంటుందని అసహనం వ్యక్తం చేశారు.  విచారణ పూర్తిగా ఏక పక్షంగా జరుగుతోందన్నారు. 


కీలక అంశాలపై విచారణ !


గత విచారణలో  కాల్ డేటా ఆధారంగా విచారణ జరిపారు. ఆ సమయంలో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిల పీఏలకు ఫోన్ చేసినట్లుగా తెలిపారు. దీంతో వారినీ సీబీఐ విచారించింది.  శుక్రవారం నాటి విచారణలో  బ్యాంక్ లావాదేవీలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.  దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను ప్రస్తావిస్తూ అవినాష్‌ను విచారిస్తున్నరని అంటున్నారు.  వివేకా హత్యకేసులో అవినాష్ పాత్ర కీలకంగా ఉందని సీబీఐ భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది.