Moolapeta port News | మూలపేట పోర్ట్ ను 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జూన్ 12 నాటికి మొదట షిప్ తీసుకురావాలని నిర్మాణదారులకి చెప్పామన్నారు.


మూలపేట పోర్ట్ పనుల పునః ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వ రరెడ్డి ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకూ మూలపేట పోర్టుకి సంబంధించి జరిగిన పనులు, ఇంకా జరగాల్సిన పనులపై ఆయన సమీక్షించారు. అలాగే స్థానికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు, నిర్వాసితుల ఇబ్బందులు అన్నింటిపై చర్చించారు. మూలపేట పోర్ట్ నిర్మాణం చేపడుతున్న విశ్వసముద్ర సంస్థ అధికారులు పోర్టు పనుల స్థితిగతులను మంత్రికి వివరించారు. అనంతరం రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ మూలపేట పోర్ట్ ను పూర్తిచేసిన తర్వాత ఆ ప్రాంతం పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. నిర్వాసితులందరికి న్యాయం చేస్తామన్నారు.


ప్రజా ధనం వృథా కాకూడదని..


2014-19 మద్యన భావనపాడు పోర్ట్ కోసం టెండర్లు సైతం పిలిచామన్నారు. ప్రభుత్వం మారడంతో మూలపేటకి పోర్టును మార్చారన్నారు. ప్రభుత్వం అనేది నిరంతరం కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. అలా కార్యక్రమాలను అమలు చేయకపోతే ఎంతో నష్టం వస్తుంద న్నారు. మూలపేట పోర్ట్ నిర్మాణ పనులు కొంత అయ్యాయన్నా రు. ప్రజాధనం వృథాకాకూడదని ఇక్కడే పోర్టును పూర్తి చెయ్యాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారన్నారు. కేంద్రం ఉప్పు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తామని చెప్పిందన్నారు. మూల పేట, విష్ణుచక్రం గ్రామాలు ఇక్కడ నుండి తరలించాలన్నారు. ఆయా బాధితులందరికి న్యాయం చేస్తామని చెప్పారు. బిపిసిఎల్ కి పెట్రోకెమికల్ కంపెనీలు ఏర్పాటు చేయమని కోరామన్నారు. ఆరు నెలల ముందే భోగాపురం ఎయిర్ పోర్ట్ ను పూర్తి చేస్తామన్నారు.


ప్రతి 50కిలోమీటర్లకి ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నోసంస్కరణలను తీసుకువచ్చామన్నారు. ఇసుక, మద్యం పాలసీలు కొత్తగా తీసుకువచ్చామన్నారు. గతంలో అంతా జగన్ కనుసన్నలలోనే ఇసుక, మద్యం పాలసీలు కొనసాగాయన్నారు. మద్యంలో జగన్ కోట్లుకొల్లగొట్టారన్నారు. ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఆరు రోజుల్లోనే 600ల కోట్ల వచ్చాయని ఆ లెక్కన ఐదేళ్ళకి ఎంత డబ్బురావాలన్నారు. మద్యం షాపుల దరఖాస్తుల ద్వారానే రూ 2వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందన్నారు.


గతంలో ఇసుకంత జగన్ దోచుకున్నారన్నారు. ఇప్పుడు ఉచిత ఇసుకను అందిస్తున్నామన్నారు. సీనరేజి సమస్య లేకుండా దానిని రద్దు చేసామన్నారు. ప్రభుత్వ ఖజానాకి 300 కోట్లు నష్టం వచ్చినా సీనరేజిని రద్దు చేసామన్నారు. ట్రాక్టర్ ఉంటే ఎవరైనా ఇసుక తెచ్చుకోవచ్చన్నారు. ఇసుక ట్రాక్టర్ ను  పోలీసులు, ఆర్ టిఓలు ఎవరైనా ఆపితే చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేసారు. 


రైతులకు న్యాయం చేస్తామన్న మంత్రి 
.వైకాపా నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. మూలపేట పోర్టు శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించాలని మేము శంకుస్థాపన చేసాము దానిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నాశనం చేసింది. ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులందరికీ కూడా పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదు ఈరోజు నుండి అతి త్వరలో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం అందించే బాధ్యత తీసుకుంటాను. ఇప్పటికే వలసల జిల్లా గా ఉన్న ఈ ప్రాంతాన్ని ఈ జిల్లాకి వలసలు వచ్చే విధంగా చేస్తానని మాట ఇస్తున్నాను. ఈ ప్రభుత్వం మాట మీద నిలబడే ప్రభుత్వం కనుక కేంద్రంలో కూడా మనకి బలం ఉంది అందుకే అతి త్వరలో మీ ముందుకు మూలపేట పోర్టుతో పాటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కూడా సిద్ధం చేస్తున్న. దీనివల్ల లక్షలాది కుటుంబాలకు ఉపాధి ఉంటుంది రవాణా సౌకర్యాలకు ఎంతో ఉపయోగ ఉండడం వల్ల ఈ ప్రాంతమంతా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. చుట్టుపక్కల భూములు కొనేందుకు చాలామంది వస్తూ ఉన్నారు  వాళ్ళ మాటలు నమ్మి మీరు భూములను తక్కువ మొత్తానికి ఇవ్వద్దు అన్నారు.