Harish Rao responds over Revanth Reddy comments on Jobs in BRS Rule | హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల విషయంలో సీఎం రేవంత్ తీరు, 2వ ప్రపంచ యుద్ద సమయంలో హిట్లర్ ప్రచార శాఖ మంత్రిగా పని చేసిన గోబెల్స్ తీరును మించిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి తప్పుడు ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.


బీఆర్ఎస్ భర్తీ చేసిన పోస్టులు ఇవే


బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో 1 లక్షా 61వేల పోస్టులు భర్తీ చేసిన మాట వాస్తవం కాదా? అని హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఒక్క పోలీసు శాఖలోనే 30,731 ఉద్యోగాలు భర్తీ చేశాం, మరో 16,337 పోస్టులను గుర్తించి, నోటిఫికేషన్ జారీ చేసి, రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్  పూర్తి చేసినట్లు చెప్పారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నియామక పత్రాలు ఇచ్చేందుకు అడ్డంకిగా మారిందని తెలిపారు. కానీ ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ ఉద్యోగాలను తామే భర్తీ చేసినట్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఉన్న పోలీసులకు ఈ వాస్తవం తెలియదననుకున్నావా అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు.


ముఖ్యమంత్రి సీటు స్థాయిని తగ్గించవద్దు రేవంత్


‘90 రోజుల్లో మొత్తం 30వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. వంద సార్లు చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవు. ఉద్యోగాల గురించి ఫైనాన్స్ శాఖ నుంచి వివరాలు తెప్పించుకుని చూడు. అబద్దాలు ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి సీటు స్థాయిని తగ్గించవద్దు. నువ్వు చెబుతున్న 30వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది అప్పటి సీఎం కేసీఆర్, హాల్ టికెట్లు ఇచ్చింది మేమే, పరీక్ష నిర్వహించింది కేసీఆర్ ప్రభుత్వం, ఫలితాలు ఇచ్చింది కేసీఆర్. దాదాపు అన్ని ప్రక్రియలు పూర్తయిన నోటిఫికేషన్లకు కేవలం నియామకపత్రాలు ఇచ్చి డబ్బా కొట్టుకుంటున్నావు రేవంత్. కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మే రోజులు పోయాయి. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. గడువు ముగుస్తోంది కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపిన మీ వైఖరిని రాష్ట్ర యువత మర్చిపోదు.


అభ్యర్థులపై వివక్ష చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం


ముఖ్యంగా గ్రూప్1 పోస్టుల భర్తీ విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై వివక్ష చూపిన మిమ్మల్ని తెలంగాణ సమాజం క్షమించదు. భవిష్యత్ ప్రభుత్వ ఉద్యోగులను లాఠీలతో కొట్టారు. అక్రమంగా అరెస్టులు చేసి అర్ధరాత్రి పోలీసు స్టేషన్లలో ఉంచిన మిమ్మల్ని ఎవరు ఉపేక్షించరని తెలుసుకో. ఉద్యోగాల ఆశ చూపి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. మోసపోయిన విద్యార్థులు, నిరుద్యోగులే కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెబుతారు’ అని హరీష్ రావు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.


Also Read: Teenmar Mallanna : జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !