YS Avinash :    మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాక తకప్పదని ప్రొద్దుటూరు  ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు.  ఈ కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని అనవసరంగా ఇరికించారని... అరెస్ట్ అయినా బెయిల్ పై వస్తారని ఆయన చెప్పుకొచ్చారు.  కడప  ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో  వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలతో  అవినాష్ రెడ్డి సమావేశం అయ్యారు.  ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌తో రెడ్డి పాటు కీలక నేతలు హాజర్యయారు.  అవినాష్‌ను సీబీఐ అరెస్ట్‌ చేస్తే రాజకీయంగా ఏం చేయాలన్నదానిపై చర్చించారు.  


చంద్రబాబే కుట్ర చేసి అవినాష్ రెడ్డిని ఇరికించారని వైసీపీ ఎమ్మెల్యే ఆరోపణ                                             


టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర చేసి అవినాష్ ను ఇరికిస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదన్నారు.  హత్యలో అవినాష్‌ పాత్ర ఉందని రుజువైతే నేను రాజకీయాల్లో ఉండనని చెప్పానని  నిందితుడిగా చేరిస్తే రాజీనామా చేస్తానని చెప్పలేదన్నారు. గతంలో న్యాయస్థానంలో ఆ విషయం రుజువైతే రాజీనామా చేస్తాననే  సవాల్ చేశానన్నారు. మరో వైపు అవినాష్ రెడ్డి ముఖ్య నేతలతో భేటీ తర్వాత హైదరాబాద్ బయలు దేరి వెళ్లారు. 


ముందస్తు  బెయిల్ పిటిషన్ పై గురువారం విచారణ                                 


వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది. బుధవారం విచారణ చేపడతామని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులకు మంగళవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి చెప్పినప్పటికీ ఇవాళ్టి జాబితాలో ఆ పిటిషన్‌ లేదు. దీంతో కోర్టు మొదలవుగానే అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ జరపాలని ఆయన తరఫు న్యాయవాదులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.  జాబితాలో లేని కేసులపై విచారణ చేపట్టలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. గురువారం విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరగా.. అందుకు న్యాయమూర్తి సమ్మతించారు. గురువారం మధ్యాహ్నం 3గంటలకు విచారణ చేపడతామని న్యాయమూర్తి తెలిపారు.  


ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకం                 


వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డికి గతంలో తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఉపశమనం కల్పించగా.. ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అలాంటి ఆదేశాలను ఎలా ఇస్తారని ప్రశ్నించింది. కనీసం 24గంటల పాటు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న అవినాష్‌ రెడ్డి న్యాయవాదుల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. విచారణలో భాగంగా ముందుగానే లిఖితపూర్వక ప్రశ్నలు అందించాలన్న అంశాన్ని తప్పుబట్టింది. తాజాగా అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.