MLA Koneti Adimulam: అవును, వాళ్లిద్దరూ రాజీ పడ్డారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేస్ క్లోజ్ అయింది. ఫిర్యాది దారే ఆయన తప్పు లేదని చెప్పారు కాబట్టి, ఇక ఆయనపై ఆరోపణలు లేనట్టే. మరి పార్టీ నుంచి బహిష్కరణ వ్యవహారంలో అప్ డేట్ ఏంటో తేలాల్సి ఉంది. కేసు లేదు కాబట్టి తిరిగి ఆయన పార్టీలో యాక్టివ్ అవుతారా, లేక తప్పు చేసి రాజీ పడ్డారు కాబట్టి కొన్నాళ్లు పార్టీకి దూరంగానే ఉండాల్సి వస్తుందా..? వేచి చూడాలి. ఇప్పటికిప్పుడు పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తుందని అనుకోలేం. ఆ వ్యవహారం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది కాబట్టి.. మరోవైపు వైసీపీ నేతలను ఇదే విషయంలో టీడీపీ తీవ్రంగా విమర్శిస్తోంది కాబట్టి మరికొన్నాళ్లు వేచి చూసే అవకాశం ఉంది. ఈ వ్యవహారం పూర్తిగా సద్దుమణిగే వరకు ఆదిమూలం కూడా సైలెంట్ గా ఉంటారని అంటున్నారు. 


సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఇటీవల ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయన తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, విషయం తన ఇంట్లో తెలియడంతో కెమెరాతో ఆ వ్యవహారం అంతా రికార్డ్ చేయాల్సి వచ్చిందని చెబుతూ, ఆ వీడియో సాక్ష్యాలు కూడా జతచేసి సీఎం చంద్రబాబుకి, మంత్రి లోకేష్ కి పంపించారామె. ఆ తర్వాత హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ రచ్చ చేశారు. వెంటనే వైసీపీ సీన్ లోకి వచ్చింది. టీడీపీపై తీవ్ర విమర్శలు చేసింది. అయితే టీడీపీ నష్టనివారణ చర్యలు చేపట్టడం, కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆ గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. 


ఉద్దేశపూర్వకంగానే తనను ఇందులో ఇరికించారని ఆదిమూలం గతంలో వివరణ ఇచ్చారు. తాను ఏతప్పూ చేయలేదన్నారు. అయితే వీడియో సాక్ష్యాలతో ఆయన పరువు సోషల్ మీడియాకెక్కింది. ఆయనపై తిరుపతి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  ఈ కేసు నమోదయ్యాక అనారోగ్యంతో కొన్నాళ్లు ఆయన ఆస్పత్రిలో చేరారు. ఈ కేసు కొట్టేయాలంటూ ఆయన హైకోర్టుని కూడా ఆశ్రయించారు. పోలీసులు ఎలాంటి ప్రాథమిక దర్యాప్తు జరపలేదని, నిజానిజాలు తెలుసుకోకుండా కేసు నమోదు చేశారని, అందువల్ల తనపై పెట్టిన కేసుని కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఆదిమూలం. ఆ ఘటన జరిగిందని చెబుతున్న నెలరోజుల తర్వాత అంత ఆలస్యంగా ఫిర్యాదు చేయడమేంటని ప్రశ్నించారు ఆదిమూలం. 


మరోవైపు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఆరోపణలు చేసిన మహిళ కూడా విచారణకు నిరాకరించడం విశేషం. వైద్య పరీక్షలకు ఆమె నిరాకరించడంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో చివరకు ఆమె వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈలోగా ఆదిమూలం పిటిషన్ విచారణకు వచ్చింది. విచారణలో బాధితురాలు కూడా ఇంప్లీడ్ అయ్యారు. కేసు రాజీ చేసుకున్నారు. తమ క్లయింట్లిద్దరూ రాజీకి వచ్చారని వారి తరపు లాయర్లు కోర్టుకి తెలియజేశారు. దీంతో కోర్టు బయటే సమస్య పరిష్కరించుకునేలా ఆదిమూలం పిటిషన్ ని డిస్పోజ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. 


దాదాపుగా ఆదిమూలం కేసు ఓ కొలిక్కి వచ్చనట్టే. బాధిత మహిళ రాజీకి వచ్చారు కాబట్టి.. పోలీస్ స్టేషన్లో కేసు కూడా వెనక్కి తీసుకునే అవకాశముంది. అయితే ఆదిమూలంకు క్లీన్ చిట్ లభించినట్టు చెప్పలేం. హోటల్ గది వీడియోలతో ఆయన పరువు పోయినట్టయింది. పార్టీ కూడా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడిక కేసే లేదు కాబట్టి.. ఆయనపై పార్టీ సానుకూలంగా ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ గొడవంతా సద్దుమణిగే వరకు ఎమ్మెల్యే కూడా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండే అవకాశముంది. ఆదిమూలంపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో లేదో చూడాలి.