Botsa Satyanarayana  Comments :  2014లో పెళ్లి అయ్యింది.. విడాకులు తీసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ కలిశారు అంటూ టీడీపీ-జనసేన పొత్తులపై సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రాకు ఏమి చేశారని ప్రశ్నించారు.  ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? రాజరికం అనుకుంటున్నారా?  అని.. టీడీపీ, జనసేన నేతలపై మండిపడ్డారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయాలపై భిన్నంగా స్పందించారు. 
 
 అసలు పుంగనూరులో గొడవ చంద్రబాబు వల్లే జరిగిందన్నారు.  టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని కలలు కనమనండి అని సూచించారు. దొంగలముఠా మరల వస్తుంది.. ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. విశాఖ రాజధానికి ఎన్నో అడ్డంకులు కలిగిస్తున్నారని మండిపడ్డారు.  లోకేష్ యువగళం పాదయాత్ర పై మంత్రి బొత్స హాట్ కామెంట్స్ చేశారు.. రాజకీయాల్లో కావాల్సింది రెడ్ బుక్ కాదు.. బ్లూ బుక్ కావాలని హితవుపలికారు. ఏమి చేసినా చట్టబద్ధంగా ఉండాలి.. ఎక్కడ యువగళం పాదయాత్రను అడ్డుకోలేదన్నారు.  లోకేష్ ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు అని దుయ్యబట్టారు. 2014లో చంద్రబాబు మేనిఫెస్టో అసలు అమలు చేయలేదన్నారు.                                  


మరో వైపు   అంగన్వాడీలను విధఉల్లోకి రావాలని బొత్స  విజ్ఞప్తి చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. వైసీపీ ప్రభుత్వం మీకు వ్యతిరేకం కాదు. మీ డిమాండ్లపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారు. ముఖ్యమంత్రి మహిళా పక్షపాతన్న ఆయన.. గుజరాత్ రాష్ట్రంలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో అంగన్‌వాడీలకు గ్రాట్యుటి లేదన్నారు.  గ్రాట్యువీటిలో కేంద్ర ప్రభుత్వానిది 50 శాతం వాటా. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నామన్నారు.   అంగన్వాడీలకు ఇచ్చే ఫైనల్ సెటిల్మెంట్ ను పెంచుతున్నాం.. ఈ నిర్ణయం ఈ నిమిషం నుంచే అమలులోకి తెస్తున్నాం అని ప్రకటించారు.                     


 వారు 11 డిమాండ్లు ఇచ్చారు.. అందులో కొన్ని కేంద్రంతో ముడిపడిన అంశాలు.. వాటిపై కేంద్రం నుంచి వివరాలు కోరాం వారు స్పందించిన వెంటనే నిర్ణయం తీసుకుంటాం అన్నారు. అంగన్వాడీలకు భీమా 100 శాతం అమలు చేస్తాం.. దీనిపై ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అంగన్వాడీల పదవి విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నాం అని వెల్లడించారు మంత్రి బొత్స. 2017 నుంచి ఇప్పటి వరకూ ఉన్న టీఏ, డీఏలు పెండింగ్లో ఉన్నాయి.. ఇప్పటి నుంచి ఆ అలవెన్స్ లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని బొత్స తెలిపారు.  తెలంగాణ కంటే ఎక్కువ అంగన్వాడీ జీతం ఇస్తాం అన్నాం.. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే చేశామని గుర్తుచేశారు. కానీ, వారు ఎప్పుడు పెంచితే అప్పుడు పెంచుతామని చెప్పలేదన్నారు. ఎన్నికల తరువాత జీతం పెంచే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.