AP Teachers Transfers :   ఆంధ్రప్రదేశ్‌లో  పది రోజుల్లో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.   ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం మంత్రి సమావేశం అయ్యారు.కొత్త విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చించారు. బదిలీలు, పదోన్నతులపై ప్రభుత్వ ఆలోచనను ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు వివరించామని తెలిపారు. యాప్‌ల వల్ల   సమయం వృథా అవుతోందని ఉపాధ్యాయ సంఘాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లాయి.  యాప్‌ల వల్ల  పని ఒత్తిడి తగ్గిస్తున్నామని ...  బోధనపైనే దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.  డిజిటలైజేషన్‌ చేసేలా అన్ని జిల్లాల్లో బైజూస్‌ కంటెంట్‌ పెడుతున్నామని తెలిపారు.                                                             

  


బదిలీలకు సంబంధించి పాత సర్వీసులనే పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి చెప్పారని... అవసరమైతే బదిలీ కోడ్‌ తీసుకొస్తామన్నారని చెప్పారన్నారు.   బదిలీల ప్రక్రియలో అక్రమాలు జరిగితే అడ్డుకుంటామని  ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. గతంలో జారీ చేసిన బదిలీల మార్గదర్శకాలను ఇటీవలే ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కోర్టుల్లో కేసులు పడటంతో  గతేడాది డిసెంబరు 26న విచారణ జరిపిన హైకోర్టు.. బదిలీ మార్గదర్శకాలు సక్రమంగా లేవని ప్రాథమికంగా అభిప్రాయపడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకుంది. 2023-24 విద్యా సంవత్సరానికి పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభంకానున్నందున మళ్లీ బదిలీ మార్గదర్శకాలు రూపొందిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.                                            
   
ఏపీలో వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ టీచర్లకు పనులు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు వర్క్‌షీట్లు అందించడం, ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’, జగనన్న విద్యా కానుక కిట్ల సరఫరా, పీఎం శ్రీ పాఠశాలల కాస్టింగ్‌ షీట్‌ రూపకల్పన, ‘నాడు-నేడు’ పనులు, పిల్లలు గ్రంథాలయాలకు వెళ్లేలా చూడడం, విద్యార్థుల ప్రవేశాల నిర్వహణలాంటి పనులను అప్పగించింది. సెలవులు విద్యార్థులకేగాని ఉపాధ్యాయులకు కాదంటూ కొందరు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మే 1నుంచి పాఠశాలలకు ఇచ్చే సెలవుల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులపై ఉన్నతాధికారులు ఆదేశాలనిచ్చారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని, వీటికి ప్రాధాన్యమిచ్చి భర్తీ చేయాలని కేంద్ర ప్రాజెక్టు ఆమోదిత మండలి (పీఏబీ-ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్) వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖకు రాష్ట్రం నుంచి అందిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాల ప్రకారం 45,355 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించింది. గత పీఏబీలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీన్ని కొట్టిపారేశారు. అవి కరోనా సమయంలో ఖాళీలని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు.