Janasena On Ysrcp Govt : రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏపీ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ (APSDC)ను రాష్ట్ర అప్పుల కార్పొరేషన్ గా వైసీపీ ప్రభుత్వం మార్చేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఏపీఎస్డీసీ ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని, గొప్పలు చెప్పి అప్పులు తీసుకొచ్చిన రాష్ట్రప్రభుత్వం దొడ్డిదారిన నేతల జేబులు నింపుకొన్నారని తెలిపారు. ఈ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పుల్లో రూ.6 వేల కోట్లు ఏమైపోయాయో లెక్కలు తేలలేదని ఆరోపించారు. ఎవరి అభివృద్ధి కోసం మళ్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన రూ. 23 వేల కోట్ల రుణాల్లో అమ్మఒడి, చేయూత, ఆసరా పథకాలకు రూ. 16,899 కోట్లు ఇవ్వగా మిగిలిన నగదు సంగతి ఏమిటని ప్రశ్నించారు. ఈ అప్పుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  


రూ.25 వేల కోట్లు రుణాలు 


నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ప్రభుత్వం 2020 ఆగస్టులో ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా ప్రతి పౌరుడికి సేవలు అందిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, పేదలకు గృహాలు కల్పిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ కార్పొరేషన్ ను వ్యతిరేకిస్తే వారిని మభ్య పెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చని జస్టిస్ మిశ్రా దగ్గర నుంచి లేఖను తీసుకొచ్చి ఇచ్చారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మొదటి ఏడాదిలోనే మోసం చేయాలనే ఒక ప్రణాళికతో బ్యాంకుల నుంచి రూ. 25 వేల కోట్లు రుణాలు తీసుకున్నారు. రుణాలు తిరిగి చెల్లించడానికి ఎస్ర్కో అకౌంట్లు ప్రభుత్వం ప్రారంభించింది." అని ఆరోపించారు. 


రాజ్యాంగ విరుద్ధం


రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ రాజ్యాంగ విరుద్ధమని, ఆర్థిక క్రమశిక్షణకు విఘాతమని పార్లమెంట్ లో కేంద్ర మంత్రే ప్రకటన చేశారని నాదెండ్ల మనోహర్ అన్నారు. రుణాలు మంజూరు చేయడంపై బ్యాంకులను హెచ్చరించారని గుర్తుచేశారు. అయితే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 7 నుంచి 9 శాతం వడ్డీకి రూ. 23 వేల కోట్లు రుణాలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు మళ్లించిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అభివృద్ధి, మౌలిక సదుపాయలకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు. కార్పొరేషన్ మొదలుపెట్టినపుడు ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఏంటి? ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పుడు భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా గ్యారెంటీలుగా చూపించి అప్పులు తెస్తున్నారన్నారు. కేవలం నాలుగు నెలల్లో  రూ.41 వేల కోట్లు అప్పలు తీసుకొచ్చారని ఆరోపించారు. 


మద్యం అమ్మకాలపై ఏడాదికి రూ. 25 వేల కోట్లు 


వైసీపీ ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. మూడేళ్లలో ఏడాదికి రూ. 25 వేల కోట్లు చొప్పున మద్యం అమ్మకాలు జరిగాయి. దీనిపై రాష్ట్రానికి ఎక్సైజ్ ఆదాయం కోట్లలో ఉంది. ఈ ఆదాయం ఎక్కడికి పోతోంది? మ్యానిఫెస్టోనే మాకు భగవద్గీత, బైబుల్, ఖురాన్ అని చెప్పారు. అధికారంలోకి రాగానే మద్యపానాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతామన్నారు. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ మంత్రే మద్యపాన నిషేధం హామీని అసలు మ్యానిఫెస్టోలోనే పెట్టలేదని అంటున్నారు. సీఎం ఎందుకు స్పందించడం లేదు. అప్పులు తెచ్చి ఆసుపత్రులు, స్కూళ్లు కడతామని చెప్పారు. అవి లేవుగానీ కొత్త బార్లు మాత్రం వచ్చాయి. మద్యంపై ఆదాయాన్ని పెంచుకోవడానికి తాజాగా మరో 840 బార్లకు లైసెన్సులు ఇచ్చారు. ప్రతి జిల్లాలో గత ఏడాది కంటే ఈ ఏడాది 40 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి. కొన్ని జిల్లాల్లో 70శాతం వరకూ ఆదాయం పెరిగింది. 


కడప జిల్లాలో కౌలు రైతుల భరోసా యాత్ర


రైతుల ఆత్మహత్యల వివరాలను గత రెండేళ్లుగా కేంద్ర క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని నాదెండ్ల ఆరోపించారు. కావాలనే రైతుల ఆత్మహత్యలను దాచిపెడుతున్నారన్నారు. కడప జిల్లాలో గత మూడేళ్లలో ఆత్మహత్య  చేసుకున్న కౌలు రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. తాజాగా తమకు అందిన లెక్కల ప్రకారం కడప జిల్లాలో 167 మంది కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలోనే 41 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు.  త్వరలోనే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి ఆర్థిక సాయం చేయడంతో పాటు, వారి కుటుంబాలకు అండగా నిలబడి భరోసా ఇస్తారన్నారు.