Pinnelli to Macherla Clash : మాచర్లలో అల్లర్లు, దాడులు టీడీపీ కుట్రలో భాగమేనని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీ చేపట్టిన కార్యక్రమంలో పథకం ప్రకారం వైఎస్సార్ పీపీ కార్యకర్తలపై దాడులు చేశారని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ ప్రచార కార్యక్రమంలో ఎవరైనా రాడ్లు, కర్రలు, మారణాయుధాలు సిద్ధం చేసుకుంటారా? అని ప్రశ్నించారు. పార్టీ జెండాల స్థానంలో రాడ్లు పట్టుకుని టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ జూలకంటి బ్మహ్మారెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు మాచర్లలో భయానక వాతావరణం సృష్టించారన్నారు. డిసెంబరు 16 సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పల్నాడులో చెలరేగిన హింసాత్మక ఘర్షణలను మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఖండించారు. టీడీపీ చేపడుతున్న కార్యక్రమాలు ఓర్చుకోలేక ప్లాఫ్ షోలు చేస్తుంటే ప్రజలు తిరగబడుతున్నారని, అందుకే ప్రచారం కోసం మాచర్లలో దాడులకు తెగబడిందన్నారు. టీడీపీ ఫ్యాక్షన్, బెదిరింపు రాజకీయాలపై ఎమ్మెల్యే పిన్నెల్లి మండిపడ్డారు. శుక్రవారం జరిగిన ఘటన పల్నాడులో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజల మధ్య సామరస్యాన్ని ధ్వంసం చేసేలా ఉన్నాయన్నారు. వైఎస్సార్సీపీని ఎదుర్కొలేక టీడీపీ నాయకులు ప్రజలను దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 






దాడులకు టీడీపీదే బాధ్యత 


పల్నాడులో ప్రజల నుంచి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత టీడీపీ దౌర్జన్యంతో దాడులు చేస్తోందని ఎమ్మెల్యే పిన్నెల్లి ఆరోపించారు. సొంత వాహనాలకు నిప్పు పెట్టి జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గం వైఎస్సార్‌సీపీ ప్రతిష్టను దిగజార్చేందుకు తప్పుడు ప్రచారం చేస్తోందని పిన్నెల్లి అన్నారు. టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేశ్ కావాలనే మాచర్లకు ఫ్యాక్షన్ నేతలను పంపి గొడవలు చేశారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో టీడీపీ ఫ్యాక్షన్ మూలాలతో దాడులు చేసి ప్రజల సెంటిమెంట్ దెబ్బతీయాలని, రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ఈ సెంటిమెంట్లను దుర్వినియోగం చేస్తోందన్నారు. టీడీపీ అసలు రంగు ఇదేనని ప్రజలు ఇప్పటికే బాగా తెలుసుకున్నారన్నారు.  ఇలాంటి దాడులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు భయపడేది లేదన్నారు. టీడీపీ నేత బ్రహ్మానందరెడ్డి తప్పుడు ప్రచారాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్లు, ఇళ్లను ధ్వంసం చేయడంతో పాటు ప్రజలపై దాడికి పాల్పడేలా టీడీపీ కార్యకర్తలకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ప్రజా ఆస్తులు, వాహనాలు, ఇళ్లు ధ్వంసానికి టీడీపీదే బాధ్యత అని పిన్నెల్లి అన్నారు. ఈ ఘటన మొత్తం కెమెరాల్లో రికార్డు అయ్యిందన్నారు. దాడుల వీడియో ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు.  ఆధారాలన్నీ పోలీసులకు అందిస్తామన్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చి బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కోరారు.