మాచర్లలో మంటపెట్టింది చంద్రబాబేనని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. గాయాల పాలైన వారు వైసీపీకి చెందిన వారేనని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.


ఆసుపత్రికి వెళ్లి పరామర్శ 


మాచర్ల ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి  శ్రీనివాసరెడ్డి, బాధితులను పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య వివరాలను అడిగి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.


పిన్నెల్లిని అంతమొందించేందుకు కుట్ర 


ఫ్యాక్షన్ నేర చరిత్ర ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల టీడీపీ ఇన్ చార్జిగా పెట్టి, చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ హత్యా రాజకీయాలకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిల ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిన్నెల్లిని ఓడించే శక్తిసామర్థ్యాలు చంద్రబాబుకు గానీ, ఆయన ఇన్ చార్జీగా పెట్టిన బ్రహ్మారెడ్డికి కానీ లేవు కాబట్టి, ఆఖరికి ఎమ్మెల్యే పిన్నెల్లినే అంతమొందించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని అంబటి విరుచుకుపడ్డారు. చంద్రబాబు హత్యా రాజకీయాలు, కుట్ర రాజకీయాలను చూస్తూ ఊరుకోమని, వారి ఆటలు సాగనివ్వమని అంబటి హెచ్చరించారు. బ్రహ్మారెడ్డి నేర చరిత్ర ఏమిటో, అతను ఎన్ని హత్యలు చేశాడో మాచర్ల ప్రజలకు తెలుసునన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా,  హత్యా రాజకీయాలు చేసినా, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కాలి గోరు కూడా పీకలేరని అంబటి అన్నారు. ఇదేం ఖర్మ అంటూ.. పల్నాడు ప్రాంతానికి ఇటీవల వచ్చిన చంద్రబాబు ఎటువంటి వ్యాఖ్యలు చేశారని అంబటి ప్రశ్నించారు.


"నేను కన్నెర్ర చేస్తే పల్నాడులో ఒక్కడు ఉంటాడా?" అంటూ పల్నాడును తిరిగి రావణకాష్టం చేసేలా, ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడింది నిజం కాదా అని మంత్రి అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు రెచ్చగొట్టిన ఆ వీడియోలు యూ ట్యూబ్లో ఇప్పటికీ ఉన్నాయన్నారు. చంద్రబాబు కూడా ఒక రౌడీలా మాట్లాడుతూ, ఆ పార్టీ నాయకులను రెచ్చగొడుతున్నారని అన్నారు.  వీరి హత్యా రాజకీయాలను చూస్తూ ఊరుకోబోమని, ఉక్కుపాదంతో ప్రభుత్వం అణచివేస్తుందని హెచ్చరించారు.  అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోవడానికి సీఎం కుర్చీలో ఉంది చంద్రబాబు కాదని.. ఆ కుర్చీలో ఉన్నది జగన్ మోహన్ రెడ్డి అన్నది తెలుసుకోవాలన్నారు. జగన్ ప్రభుత్వంలో తప్పు చేసిన వారు ఎవరైనా తప్పించుకోలేరని చెప్పారు. 


బీసీలపై టీడీపీ దాడులు...


నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఇదేం ఖర్మ కార్యక్రమం ముసుగులో  తెలుగుదేశం పార్టీ నేతలు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇదేం ఖర్మ అంటూ టీడీపీ నేతలు ప్రజల వద్దకు వెళుతుంటే.. ప్రజలు వారిని ఛీ కొడుతున్నారని, దాంతో ప్రజలపైనే దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.  7 హత్య కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న బ్రహ్మారెడ్డి టీడీపీ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మాచర్లలో విధ్వంసకాండలు ప్రారంభమయ్యాయన్నారు. పల్నాడు లో ఫ్యాకన్ రాజకీయాలను మళ్లీ ప్రారంభించి, ప్రోత్సహిస్తున్న వ్యక్తి బ్రహ్మారెడ్డి అని అన్నారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలా ఎదుర్కోవాలో  తెలియక ఇలాంటి దాడులకు, దుర్మార్గాలకు టీడీపీ పాల్పడుతుందని అన్నారు. టీడీపీ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బీసీలు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడవటం చూసి, ఓర్వలేక బీసీలపైనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. 


ఇదేం ఖర్మకు వెళితే.. రాళ్ళు, కర్రలు ఎందుకు.. 


 ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిచ్చుపెట్టేందుకు నిరంతరం టీడీపీ ప్రయత్నిస్తుందని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇదేం ఖర్మ కార్యక్రమం చేపట్టి ఇంటింటికి వెళ్లే టీడీపీ నేతలకు రాళ్లు, కర్రలు ఎందుకు తీసుకువచ్చారో చెప్పాలన్నారు. ఇదేం ఖర్మ కార్యక్రమం పేరిట దాడులకు పాల్పడటమే లక్యం గా టీడీపీ ప్రణాళికలు తయారు చేశారని అన్నారు. కనీసంగా 20 కేసులు అయినా లేకపోతే వారు టీడీపీ నాయకులు కాలేరు.. అంటూ చంద్రబాబు సర్టిఫికెట్ ఇవ్వడం దేనికి సంకేతం అన్నారు. ఇటీవల పల్నాడు ప్రాంతంలో పర్యటించిన సందర్భంలో.. చంద్రబాబు ప్రసంగాలను పరిశీలిస్తే.. తాట తీస్తాం, తోలు తీస్తాం, రండి చూసుకుందాం.. లాంటి మాటలతో కార్యకర్తలను రెచ్చగొట్టి... పల్నాడులో ఫ్యాక్షన్ ను రాజేసి, రాజకీయంగా లబ్ధి పొందాలని తాపత్రయపడుతున్నారని అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.