వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఈ ఉదయం నివాళి అర్పించారు. ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె వెంట తల్లి విజయ, కుమారుడు రాజారెడ్డి, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సందర్భంగా తల్లి విజయ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. కంట నీరు తుడుచుకుంటూ కనిపించారు. 


వైఎస్‌ జయంతి సందర్భంగా ఏటా జులై 8న వైెస్‌ ఫ్యామిలీ మొత్తం కలుసుకునేది. అందరూ ఇడుపులపాయలో జరిగే ప్రార్థనల్లో పాల్గొనే వాళ్లు. కానీ వైఎస్‌ జగన్‌, షర్మిల మధ్య విభేదాలు కారణంగా వేర్వేరుగా వచ్చి నివాళి అర్పిస్తున్నారు. గతేడాది ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు. ఒకటిగానే వచ్చినా వేర్వేరుగానే ఉన్నారు. ఈసారి మాత్రం ఉదయం షర్మిల వచ్చి వెళ్లిపోయిన తర్వాత జగన్‌ వస్తున్నారు. ఆయన మధ్యాహ్నం 2 గంటలకు ఇడుపులపాయచేరుకొని తండ్రి సమాధికి నివాళి అర్పించనున్నారు. 


వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారని, ప్రియాంక టీంతో షర్మిల చేతులు కలపబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. పదే పదే వీటిని ఆమె ఖండిస్తున్నా తరచూ కాంగ్రెస్ నేతలతో సమావేశాలు ఈ పుకార్లకు ఊతమిస్తున్నాయి. మొత్తానికి ఈ విషయంపై  ఇవాళ ఏదో ఒకటి తేల్చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


షర్మిల ఆస్తుల పంపకం 
శుక్రవారమే కడప చేరుకున్న షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. వేంపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన షర్మిల తన పేరు మీద ఉన్న 9.53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేశారు. మరో 2.12 ఎకరాల భూమిని కుమార్తె అంజలి రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. అక్కడి నుంచి ఇడుపులపాయ చేరుకొని అక్కడే రాత్రి బస చేశారు.