Nara Lokesh: తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లు వంటిదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వైసీపీ సర్కారు, సీఎం జగన్ మోహన్ రెడ్డిని బీసీ ద్రోహులుగా అభివర్ణించారు లోకేశ్. టీడీపీ హయాంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచితే వైసీపీ ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్లను కుదిరించారని లోకేశ్ ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ విడిది కేంద్రం వద్ద బీసీ సామాజిక వర్గం ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి మాట్లాడారు. సీఎం జగన్ ప్రభుత్వం బీసీ కుల ధ్రువీకరణ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. వైసీపీ పాలనలో గొర్రెల కాపరులకు ఎటువంటి సహాయం అందడం లేదని ఆరోపించారు. దూదేకుల ముస్లిం కుటుంబాలకు, రజకులకు ఏపీ సర్కారు ఎటువంటి సాయం చేయడం లేదని లోకేశ్ ముందు ఆయా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. 


తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లు వంటిదని లోకేశ్ అన్నారు. బీసీలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నమ్మించి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి 16,500 మంది బీసీలను పదవులకి దూరం చేశారని ఆరోపణలు గుప్పించారు. బీసీలపై 26 వేల అక్రమ కేసులు పెట్టి వేధించారని విమర్శలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకు వస్తామని లోకేశ్ చెప్పారు. న్యాయ పోరాటానికి కావాల్సిన ఆర్థిక సహాయం ప్రభుత్వమే అందిస్తుందని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందిస్తామని తెలిపారు. వాల్మీకిలు ఏ వృత్తిలో ఉన్నా వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి రాయితీ రుణాలు అందిస్తామని లోకేశ్ వివరించారు.


మంత్రి ఆదిమూలపు సురేష్ షర్టు విప్పి.. టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు వేశారని ఆరోపించారు నారా లోకేశ్. మంత్రి సురేష్ కు నిజంగా దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వారిపై దమనకాండకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఎందుకు ప్రశ్నించడం లేదని లోకేశ్ ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ మొదలుకుని డాక్టర్ అచ్చెన్న వరకూ ఎంతో మంది దళితులను వైసీపీ నాయకులు చంపేస్తే ఆదిమూలపు సురేష్ అప్పుడు ఎందుకు నోరు విప్ప లేదని లోకేశ్ నిలదీశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ఇకనుంచైనా దళితుల కోసం పాటుపడాలని లోకేశ్ గుప్పించారు. 






వైసీపీ పాలనలో రాష్ట్రంలోని కొండలు, గుట్టలు అన్నీ మాయమవుతున్నాయని నారా లోకేశ్ మండిపడ్డారు. కొండలు గుట్టల్ని కనపడనీయవా క్యాష్ ప్రసాదూ అంటూ నారా లోకేష్ సెల్ఫీ విడుదల చేశారు. గత మూడు రోజులుగా ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాష్ ప్రసాద్ అవినీతి చిట్టా బయటపెడుతుంటే.. ఆయనేమో బూతుల పంచాంగం వినిపిస్తున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. క్యాష్ ప్రసాద్ నాయకత్వంలో ఎర్రగట్టుకొండను తవ్వేసి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న దృశ్యమిది అంటూ లోకేశ్ విమర్శించారు. రోజూ 50 టిప్పర్ల ఎర్రమట్టిని టిప్పర్ కు 5 వేల రూపాయల చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో కొండలు, గుట్టలు కనిపించకుండా చేస్తానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్ద ఏమైనా శపథం చేశావా ఎమ్మెల్యే అంటూ లోకేశ్ ప్రశ్నించారు.