Kurnool Crime News: కర్నూలు రాజకీయ విభేదాలు హత్యకు దారి తీశాయి. సంజన్న అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. గతంలో ఆయన వైసీపీలో ఉన్నారు. ఎన్నికల టైంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. రాజకీయంగా ఇద్దరి మధ్య ఉన్న ఆధిపత్య పోరే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంజయ్ కుటుంబంతో రామాంజనేయులు(అంజి) కుటుంబానికి ఎప్పటి నుంచో రాజకీయ విభేదాలు ఉన్నాయి. సంజయ్ కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్గీయుడు అయితే అంజి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వర్గీయుడు. కాటసానితో పొసగడం లేదని ఎన్నికల టైంలో సంజన్న టీడీపీలో చేరారు. 

మూడు నెలల క్రితం అంజి, సంజన్న మధ్య గొడవలు జరిగాయి. ఈ గొడవ కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అంజిపై హత్య కేసులు ఉన్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు గ్రామంలో పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. 

సంజన్న భార్య గతంలో వైసీపీ కార్పొరేటర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు జయరాం కార్పొరేటర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆ పార్టీలో ఉన్నాడు. సంజన్న బైరెడ్డి శబరి వర్గీయుడు. అంజి బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి వర్గీయుడు. 

సంజన్న రాత్రి 9 గంటల సమయంలో మెడిటేషన్ సెంటర్‌కు వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు దాడి చేశారు. కర్నూలు శరీన్‌నగర్‌కు చెందిన అంజి అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాల పాలైన సంజన్నను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు సంజన్న.

చాలా కాలం తర్వాత ఇలాంటి హత్య కర్నూలు లో జరగడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ప్రశాంతంగా ఉంటున్న సీమలో జరిగిన హత్యతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు.