నంద్యాలలో అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య వార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలతో మాట్లాడిన ఆయన వివాదం పరిష్కారానికి సీనియర్లతో కమిటీ వేసినట్టు సమాచారం. 


లోకేష్ యువగళం పాదయాత్ర సాగుతున్న నంద్యాలలో టీడీపీ అంతర్గత పోరుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. లోకేష్‌కు స్వాగతం చెప్పే టైంలో సుబ్బారెడ్డి, అఖిల ప్రియ వర్గీయుల రోడ్లపై కొట్టుకోవడాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వివాదం పరిష్కారానికి తిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. 


త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన చంద్రబాబు.. నంద్యాలలో ఏం జరిగిందో ఏం జరుగుతుందో నివేదిక ఇవ్వాలని చెప్పారు. పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని హెచ్చరించినట్టు తెలుస్తోంది. 


కొన్ని కొన్నిసార్లు టీడీపీ సమావేశాల్లో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు వచ్చి కావాలని రెచ్చగొట్టే పనులు చేసే అవకాశం ఉందని... అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు.