Srisailam News: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు  అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 8న మహాశివరాత్రి( Maha Sivarathri) పర్వదినం పురస్కరించుకుని  వచ్చే నెల 1 నుంచి 11 వరకు ఉత్సవాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఉత్సవాల జరిగినన్ని రోజులు ఆలయంలో ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలు నిలిపివేయనున్నట్లు  తెలిపారు. పెద్దసంఖ్యలో తరలిరానున్న భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.


బహ్మోత్సవాలు
మహాశివరాత్రి ఉత్సవాలకు  శైవక్షేత్రాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోనే అతి కీలకమైన జ్యోతిర్లంగ ఆలయం శ్రీశైలం(Srisailam) మల్లన్న ఆలయంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (Brahmotasavam) జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా  స్వామివార్లకు ప్రత్యేక పూజలు ఊరేగింపుల కారణంగా మార్చి 1 నుంచి 11 వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు స్పర్శ దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు ఈవో పెద్ది రాజు  వెల్లడించారు. బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శినానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు నిర్దిష్టవేలల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందన్నారు. 5 వ తేదీ సాయంత్రం 7:30 గంటల నుంచి 11వ తేదీ వరకు భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర, అతి శీఘ్రదర్శనానికి ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్‌కు ఏర్పాట్లు చేశారు.  ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోనే జ్యోతిర్లింగమైన శ్రీశైలంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగనున్నాయి. 
భారీగా భక్తులు
శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు  పెద్దసంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. తెలుగు రాష్ట్రల నుంచే కాకుండా కర్ణాటక(Karnataka), తమిళనాడు (Tamilanadu)నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే మహాశివరాత్రి రోజూ కర్ణాటక భక్తులు కాలినడక మార్గంలో అటవీ ప్రాంతం గుండా మల్లన్న దర్శనానికి పెద్దసంఖ్యలో వస్తారు, వారికోసం ప్రత్యేకంగా నడక మార్గంలో ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.  పాదయాత్ర మార్గంలోని భీమునికొలను, కైలాసద్వారం మార్గంలో భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.  అదనపు క్యూలైన్లు, వసతి, తాగునీరు, ట్రాఫిక్‌ నియంత్రణ, పారిశుద్ధ్య పనులు తదితర వాటిపై సంబంధిత అధికారులతో ఆలయ ఈవో(EO) సమీక్షించారు. 


బ్రహ్మోత్సవాల షెడ్యూల్
మార్చి 1వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారులు స్వామివారికి  పట్టువస్త్రాల సమర్పించనున్నారు. మార్చి 2న  భృంగీ వాహన సేవ, ప్రత్యేక సేవలు నిర్వహించనున్నారు. మార్చి 3న  హంస వాహన సేవ జరగనుండగా... విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాల సమర్పించనున్నారు. మార్చి 4 మయూర వాహన సేవకు  కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాల సమర్పించనున్నారు. మార్చి 5న జరిగే రావణ వాహన సేవకు  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించనుంది.6న పుష్పపల్లకీ సేవ, 7న గజవాహన సేవ నిర్వహించనున్నారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా  ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ప్రభోత్సవం, నంది వాహన సేవ. లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 9రథోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలు చేపట్టనున్నారు. మార్చి 10న  ధ్వజావరోహణం చేయనుండగా..మార్చి 11 అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలతో  శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.