ఉదయం నుంచి నడిచిన హైడ్రామాకు అరెస్టుతో పోలీసులు ప్రస్తుతానికి తెరదించారు పోలీసులు. టీడీపీ లీడర్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి  సత్యసాయి జిల్లా టూర్‌ పోలీసులకు చాలా టెన్షన్ పెట్టింది. ఆయన వస్తే అడ్డుకుంటామని పల్లె రఘునాథ్‌ రెడ్డి వర్గీయులు కాచుకొని కూర్చొని ఉండటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 


పుట్టపర్తి వెళ్లేందుకు బయల్దేరిన టీడీపీ సీనియర్ లీడర్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రాప్తాడు మండలం మరూర్ టోల్‌గేట్‌ వద్ద జేసీ ప్రభాకర్‌ రెడ్డిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జేసీ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 


రాప్తాడు మండలం మరూర్ టోల్ గేట్ తనను అడ్డుకున్న పోలీసులతో జేసీ ప్రభాకర్‌ రెడ్డి వాదులాటకు దిగారు. తాను సత్యసాయి జిల్లా ఎస్పీని కలిసేందుకు వెళ్తున్నట్టు వివరించే ప్రయత్నం చేశారు. ఎస్పీని కలిపి వినతి పత్రం ఇచ్చి వస్తేనంటూ రిక్వస్ట్ చేశారు. అయినా ఆయన వెళ్లేందుకు పోలీసులు అంగీకరించలేదు. పుట్టపర్తి వెళ్తే లా అండ్‌ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 


పోలీసులు ఎంత చెప్పిన జేసీ దివాకర్‌రెడ్డి వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా పుట్టపర్తి వెళ్లి తీరుతానంటూ భీష్మించారు. నడుచుకోనైనా వెళ్తానంటూ పోలీసులకు తేల్చి చెప్పారు. తీవ్ర ఉద్రిక్తత మధ్యే ఈ పంచాయితీ నడిచింది. ఎంత చెప్పినా జేసీ వినకపోయే సరికి పోలీసులు అరెస్టు చేశారు. టోల్‌ప్లాజా వద్ద అరెస్టు చేశారు. 


జేసీ ప్రభాకర్‌ రెడ్డి పుట్టపర్తి పర్యటన ఉదయం నుంచి తీవ్ర చర్చకు దారి తీసింది. ఉజ్వల్‌ ఫౌండేషన్‌లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న జేసీ ప్రభాకర్‌ రెడ్డి... పుట్టపర్తిలోని కొత్త చెరువులో పర్యటిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆయన్ని అడ్డుకునేందుకు పల్లె వర్గీయులు రెడీ అయ్యారు. ఇలా ఇరు వర్గాలు అక్కడ పరస్పరం దాడులు చేసుకునే ఛాన్స్ ఉందని గ్రహించిన పోలీసులు భారీగా మోహరించారు. జేసీని అడ్డుకొని మార్గమధ్యలోనే అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.