Byreddy Rajasekhar Reddy: రాయలసీమకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది శూన్యమని రాయలసీమ పరిరక్షణ సమితి ఆరోపించింది. సాగు - తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూనే, రాయలసీమ ప్రాంతాన్ని సిఎం జగన్ ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా..? అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీకి మూడు రాజధానులు అవసరం లేదని, విశాఖలో పరిపాలన రాజధాని అవసరం లేదని ప్రజలే చెబుతున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాయలసీమ ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటానికి ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. 28వ తేదీన ఛలో సంగమేశ్వరం, సిద్ధేశ్వరం కార్యక్రమాన్ని సక్సెస్ చేశారని గుర్తుచేశారు. కృష్ణానదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి- బ్యారేజ్ నిర్మించాలని, దాంతోపాటు అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోకపోతే రాయలసీమకు నీటి చుక్క కూడా మిగలదని వ్యాఖ్యానించారు.


బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించండి 
కరువుకు సమాధానం చిత్తూరు జిల్లాతో పాటుగా గతంలో నిర్మాణం చేయాలనుకున్న కృష్ణా పెన్నారు ప్రాజెక్టు కట్టలేదో, ఇప్పుడు నిర్మాణానికి అవకాశానికి ఛాన్స్ వచ్చిందన్నారు. అయితే తీగల వంతెనకు బదులుగా బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మించాలని డిమాండ్ తో ఛలో సిద్ధేశ్వరం అని పిలుపునిస్తే మారుమూల ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారని చెప్పారు. పార్లమెంట్ లో దీని ప్రస్తావన రావడం మంచి పరిణామం. బ్రిడ్జి కమ్ బ్యారేజీ బదులుగా దీన్ని కృష్ణా పెన్నారుగా పిలిస్తే బాగుంటుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత తక్కువ నీటి పారుదల ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా అని లెక్కలు చెబుతున్నాయి. 75 ఏళ్లుగా రాయలసీమకు నేతలు మోసాలు చేశారు, శాడిస్టుల మాదిరిగా వేదించారని.. హోస్పేట డ్యామ్, బళ్లారి జిల్లా పోయింది. వచ్చిన రాజధాని మూడేళ్లకే పోగొట్టుకున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.


నారా లోకేష్ కు సూచన.. 
జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కృష్ణా పెన్నారు ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేయాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూచించారు. తమ కల్చర్ మీద సైతం దాడి జరిగిందని, రాయలసీమలో అంతా గూండాలు అని, ఫ్యాక్షనిజం అని సినిమాల్లో చూపించి విలువ దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టినా అందులోనుంచి మాకు నీళ్లు రావు, అరకొర ప్రాజెక్టులు కట్టి ప్రచారానికి వాడుకున్నారు కానీ తమకు నీళ్లు రాలేదన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం రూ.5 వేల కోట్లు ఇవ్వనుంది. దాంతో తుంగభద్ర నీళ్లు మాకు వచ్చే ఛాన్స్ లేదన్నారు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టు కడితే.. ఎల్.ఎల్.సి, హెచ్.ఎల్.సి ప్రాజెక్టు పోతుంది. సుంకేసుల నిండదు, అనంతపురం, కర్నూలు, కడప నీళ్లు లేక దెబ్బతినే పరిస్థితి తలెత్తుతుందన్నారు. 


ఆర్డీఎస్ కాలువకు నీళ్లు ఉండవని, గ్లా్స్ నీళ్లు కూడా ఉండవని తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం గుర్తుంచుకోవాలన్నారు. రాయలసీమ వాళ్లకు ఆ ప్రాజెక్టు వల్ల జరిగే నష్టం నేతలకు ఇంకా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వతంగా నీళ్లు రావు, భావితరాలు నాశనం అవుతాయని పార్టీలు వదిలిపెట్టి అప్పర్ భద్ర ప్రాజెక్టును వ్యతిరేకించాలని నేతలకు పిలుపునిచ్చారు.